Narasimha: లగ్నాలు పెట్టుకున్న రోజే యువకుడి ఆత్మహత్య!

  • సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న నర్సింహ
  • బోడుప్పల్‌కి చెందిన యువతితో వివాహం నిశ్చయం
  • ఆదివారం ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య

వివాహం నిశ్చయమైంది. ఆదివారం లగ్నపత్రిక రాసుకోవాల్సి ఉంది. కానీ పెళ్లి కుమారుడు జాడ లేదు. పక్కింటి వాళ్లకు యువకుడి తల్లిదండ్రులు ఫోన్ చేయగా.. వారు వెళ్లి చూస్తే ఆ యువకుడు విగతజీవిగా కనిపించాడు. ఎస్సై రాజు కథనం ప్రకారం.. భువనగిరి సమీప తుక్కుపూర్‌కు చెందిన నర్సింహ(28) హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. వనస్థలిపురంలోని ఆర్టీసీ కాలనీలో ఓ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్నాడు.

బోడుప్పల్‌కి చెందిన యువతితో ఇటీవల అతనికి వివాహం నిశ్చయమైంది. ఆదివారం ఇరువైపుల పెద్దలు లగ్నాలు పెట్టుకున్నారు. కానీ నర్సింహ మాత్రం వెళ్లలేదు. దీంతో అతడి తల్లిదండ్రులు ఫోన్ చేశారు. అయినా స్పందించకపోవడంతో అపార్ట్‌మెంట్‌లోని పక్క ఫ్లాట్ వారికి సమాచారమిచ్చారు. వారు వెళ్లి చూడగా.. నర్సింహ ఫ్యానుకు ఉరివేసుకుని కనిపించాడు. పోలీసులకు సమాచారమివ్వగా.. మృతదేహాన్ని ఉస్మానియాకు తరలించి, విచారణ చేబట్టారు. నర్సింహ ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు.

More Telugu News