raafel: ‘రాఫెల్’ ఒప్పందం వివరాలను ‘సుప్రీం’కు సమర్పించిన కేంద్రం

  • డీపీపీ ప్రక్రియ-2013 ప్రకారమే కొనుగోలు చేశాం
  • ఫ్రాన్స్ తో ఏడాది పాటు చర్చలు జరిగాయి
  • అవి ఆమోదించాకే ఇరు దేశాలు సంతకాలు చేశాయి

రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు వ్యవహారంలో భారీ అవినీతి జరిగిందని ప్రతిపక్షాలు తీవ్ర ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సీబీఐతో దర్యాప్తు చేయించాలంటూ పలు పిటిషన్లు దాఖలు కావడంతో, ‘రాఫెల్’ వివరాలను సమర్పించాలంటూ కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఇటీవల ఆదేశాలు జారీ చేసింది.

ఈ క్రమంలో కేంద్రం స్పందించింది. ఇందుకు సంబంధించిన ధరల వివరాలను సీల్డ్ కవర్ లో సుప్రీంకోర్టుకు ఈరోజు సమర్పించింది. ఫ్రాన్స్ నుంచి 36 యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించి నిర్ణయం తీసుకున్న విధానంపై, ధరల గురించి తెలియజేసింది.

ఆయుధాల సేకరణకు సంబంధించిన నిబంధనలను పూర్తిగా పాటించామని స్పష్టం చేసింది. రక్షణ పరికరాల కొనుగోలు ప్రక్రియ(డీపీపీ) -2013 ప్రకారమే ఈ విమానాలను ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేశామని పేర్కొంది. ఈ ఒప్పందం కోసం ఫ్రాన్స్ అధికారులతో భారత్ కు చెందిన బృందం ఏడాది పాటు చర్చలు జరిపిందని తెలిపింది. చర్చల అనంతరం భద్రతపై ఏర్పాటు చేసిన కేబినెట్ కమిటీ, కాంపిటెంట్ ఫైనాన్షియల్ అథారిటీ ఆమోదం తర్వాతే ఈ ఒప్పందంపై రెండు దేశాలు సంతకాలు చేసిట్టు కేంద్రం వివరించింది. కాగా, ఈ కేసు తదుపరి విచారణను ఈ నెల 14కు వాయిదా వేస్తున్నట్టు సుప్రీంకోర్టు పేర్కొంది. 

More Telugu News