Jagan: హత్యాయత్నం తరువాత తొలిసారి మాట్లాడిన జగన్!

  • 17 రోజుల విరామం తరువాత ప్రారంభమైన పాదయాత్ర
  • సాలూరు సమీపంలోని పాపయ్యవలసలో నడుస్తున్న జగన్
  • పార్టీలో చేరిన బీసీ నేత మార్గాని నాగేశ్వరరావు

తనపై జరిగిన హత్యాయత్నం తరువాత 17 రోజుల పాటు విశ్రాంతి తీసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్, నేడు తన ప్రజాసంకల్ప యాత్రను విజయనగరం జిల్లా సాలూరు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని పాపయ్యవలసలో తిరిగి ప్రారంభించారు. ఈ సందర్భంగా  బీసీ సంఘాల ఐకాస చైర్మన్ మార్గాని నాగేశ్వరరావు జగన్ సమక్షంలో వైకాపాలో చేరారు. ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన జగన్, హత్యాయత్నం తరువాత ప్రజలను ఉద్దేశించి తొలిసారిగా మాట్లాడారు.

మార్గాని వంటి నేత చేరికతో తమ పార్టీ మరింతగా బలపడిందని, జనాభాలో అత్యధిక సంఖ్యలో ఉన్న బీసీలకు తాము మరిన్ని సీట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ప్రజల ఆశీస్సుల వల్లే తానిలా తిరిగి మీ ముందుకు వచ్చానని అన్నారు. మార్గానితో పాటు పార్టీలో చేరిన పలువురిని జగన్ ఆహ్వానించారు. ఆయన పాదయాత్ర నిదానంగా సాగుతోంది. జగన్ ను చూసేందుకు, పరామర్శించేందుకు అధిక సంఖ్యలో ప్రజలు, కార్యకర్తలు తరలి రావడంతో, అందరినీ పలకరిస్తూ జగన్ నెమ్మదిగా ముందుకు సాగుతున్నారు.

More Telugu News