yarada beach: విశాఖ యారాడ తీరంలో గల్లంతైన వారికోసం ముమ్మర గాలింపు

  • ఆదివారం సముద్ర స్నానం కోసం దిగిన పన్నెండు మంది
  • కెరటాల్లో చిక్కుకుని కొట్టుకు పోయిన ఆరుగురు
  • హెలికాప్టర్‌, మూడు బోట్ల సాయంతో గాలింపు చర్యలు

సముద్రంలో స్నానానికని దిగి కెరటాల ఉద్ధృతికి కొట్టుకు పోయిన ఆరుగురి జాడ తెలుసుకునేందుకు సహాయక బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. విశాఖ మహా నగరంలోని పర్యాటక కేంద్రాల్లో ఒకటైన యారాడ బీచ్‌లో ఆదివారం ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. నగరంలోని హెచ్‌బీ కాలనీ పరిసర ప్రాంతాలకు చెందిన కొందరు స్నేహితులు విహార యాత్రకు యారాడ వచ్చారు.

మధ్యాహ్నం వరకు బీచ్‌ పరిసరాల్లో సరదాగా గడిపారు. భోజనాలు పూర్తయ్యాక మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో స్నేహితుల్లో 12 మంది సముద్ర స్నానానికి దిగారు. కాసేపటికి వచ్చిన ఓ భారీ అల స్నేహితులను లోపలికి లాక్కుపోయింది. కొందరిని అక్కడి మత్స్యకారులు రక్షించగా ఆరుగురి జాడ తెలియకుండా పోయింది.

వీరి ఆచూకీ కోసం నేవీకి చెందిన ఓ హెలికాప్టర్‌, మూడు బోట్లలో సహాయక బృందాలు వెతుకుతున్నాయి. తమ బిడ్డలు ఏమయ్యారో అర్థం కాక, వారు క్షేమంగా తిరిగి రావాలని కోరుకుంటూ ఆదివారం సాయంత్రం నుంచి బాధిత కుటుంబాల సభ్యులు సముద్రం ఒడ్డునే ఎదురు చూస్తున్నారు. గల్లంతైౖన వారిని దేవర వాసు,  నక్క గణేష్, రాజేష్,  పేరిడి తిరుపతి, దుర్గ,  కోన శ్రీనివాస్ లుగా గుర్తించారు.

More Telugu News