Mukesh Ambani: ముకేశ్ అంబానీ కూతురి వివాహ ఆహ్వాన పత్రిక ధరే పెద్ద షాకింగ్!

  • డిసెంబర్ 12న ఈశా-ఆనంద్‌ల వివాహం
  • రెండు పెట్టెల్లో వివాహ ఆహ్వాన పత్రిక
  • ఒక పెట్టెలో బంగారు పూతతో చేసిన డైరీ
  • రెండో పెట్టెలో నాలుగు చిన్న ఆభరణాల బాక్సులు

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత, ప్రముఖ పారిశ్రామిక వేత్త ముకేశ్‌ అంబానీ ఇంట వివాహమంటే ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పెళ్లి తంతు మొదలైనప్పటి నుంచి ప్రతిదీ విశేషమే. ప్రస్తుతం ఆయన కుమార్తె ఈశా అంబానీ వివాహానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈశా-ఆనంద్ పిరమాల్‌ల వివాహం డిసెంబర్ 12న ముంబయిలోని అంబానీ నివాసంలో అంగరంగ వైభవంగా జరగనుంది.

ఈ వివాహానికి సంబంధించిన వేడుకలు మాత్రం డిసెంబర్ 8 నుంచే ఉదయ్‌పూర్‌లో జరగనున్నాయి. వీరి వివాహ ఆహ్వాన పత్రికకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పటికే సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుండగా.. తాజాగా మరో వీడియో వైరల్ అవుతోంది. ఈశా వివాహ ఆహ్వానపత్రికకు సంబంధించి రెండు పెట్టెలుంటాయి. వీటిలో ఒక పెట్టె ధర అక్షరాలా రూ.3 లక్షలట. విషయం తెలుసుకున్న నెటిజన్లు ఈ శుభలేఖకైన ఖర్చుతో పేదింట్లో 2-3 పెళ్లిళ్లు జరిగిపోతాయని కామెంట్లు పెడుతున్నారు.

వివాహ ఆహ్వాన పత్రిక ప్రత్యేకత ఏమిటంటే...

పెళ్లి పత్రికను రెండంచెల పెట్టెల్లో అమర్చారు. మొదటి పెట్టె లోపల డైరీ రూపంలో వివాహ పత్రిక ఉంటుంది. బంగారు పూతతో డిజైన్ చేసిన ఈ డైరీని తెరవగానే గాయత్రి మంత్రం వినిపిస్తుంది. తర్వాతి పేజీలో శ్రీకృష్ణుడి ప్రతిమ ఓ వైపు, ఈశా, ఆనంద్ రాసిన లేఖ ఓవైపు వుంటాయి. నాలుగో పేజీలో ‘శుభ్ అభినందన్’ పేరుతో ఆహ్వాన పత్రిక, మిగిలిన పేజీల్లో వధూవరుల కుటుంబ సభ్యుల పేర్లు, బంధువుల పేర్లు, హిందూ దేవుళ్ల మంత్రాలను పొందు పరిచారు.

ఇక రెండో బాక్సులో నాలుగు చిన్న ఆభరణాల పెట్టెలుంటాయి. ఆ పెట్టెల్లో బంగారు ఫ్రేములతో తయారు చేసిన హిందూ దేవతల ప్రతిమలతో పాటు చిన్న సంచుల్లో అత్యంత విలువైన రాళ్లతో తయారు చేయించిన నెక్లెస్‌లుంటాయి. రెండో బాక్స్ విలువ రూ.3 లక్షలుంటుందని అంచనా.

More Telugu News