Gali Janardhan Reddy: రాత్రి బాగా నిద్రపట్టిందా? అంటూ గాలిని ప్రశ్నిస్తూ ఈ ఉదయాన్నే విచారణ ప్రారంభించిన అధికారులు!

  • నిన్న పోలీసులకు లొంగిపోయిన గాలి
  • రాత్రి 2 గంటల వరకూ విచారణ
  • ఆపై సీసీబీ కార్యాలయంలోనే నిద్ర
  • నేడు విచారిస్తున్న ఏసీపీ వెంకటేష్ ప్రసన్న

పోంజీ స్కామ్ లో వరుసగా రెండో రోజు కూడా గాలి జనార్దన్ రెడ్డిని సీసీబీ పోలీసులు విచారిస్తున్నారు. మూడు రోజుల అదృశ్యం అనంతరం నిన్న ఆయన పోలీసులకు లోంగిపోగా, సాయంత్రం నుంచి అర్ధరాత్రి 2 గంటల వరకూ ఆయన్ను విచారించిన అధికారులు, ఈ ఉదయాన్నే తిరిగి ప్రశ్నించడం ప్రారంభించారు.

గత రాత్రి ఆయన్ను అక్కడే ఉంచిన అధికారులు, ఓ దుప్పటి, కొన్ని దుస్తులు, భోజనాన్ని అందించారు. ఆపై ఆయన క్రైమ్ బ్రాంచ్ కార్యాలయం వెయిటింగ్ రూములో నిద్రపోయారు. ఈ ఉదయం గాలిని విచారించేందుకు వచ్చిన ఏసీపీ వెంకటేష్ ప్రసన్న, 'రాత్రి బాగా నిద్రపట్టిందా?' అని ప్రశ్నించారు. కాగా, నేడు గాలి అరెస్ట్ ను చూపించి, ఆయన్ను కోర్టుకు తరలించే అవకాశాలు ఉన్నట్టు పోలీసు వర్గాలు అంటున్నాయి.

More Telugu News