social media summit: విజయవాడలో కూడా నా అభిమానులు ఉంటారని ఊహించలేదు : కరీనా కపూర్‌

  • నా అభిమానుల్ని పరిచయం చేసిన ఏపీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు
  • అమరావతి నగరం అద్భుతంగా ఉంది
  • ‘స్టయిల్‌ ఐకాన్‌ ఆఫ్‌ ఇయర్‌’ అవార్డు అందుకున్న కరీనా 

‘విజయవాడ నగరంలో కూడా నాకు అభిమానులు ఉంటారని ఊహించ లేదు. నా అభిమానులను పరిచయం చేసిన ఆంధ్రప్రదేశ్‌ పభ్రుత్వానికి కృతజ్ఞతలు’ అంటూ బాలీవుడ్‌ బ్యూటీ కరీనా కపూర్‌ ఉబ్బితబ్బిబ్బయిపోయింది. నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ఏపీ పర్యాటక శాఖ, కృష్ణా జిల్లా యంత్రాంగం సంయుక్తంగా శనివారం నిర్వహించిన ‘సోషల్‌ మీడియా సమ్మిట్‌ అండ్‌ అవార్డ్స్‌-2018’ కార్యక్రమానికి కరీనా ముఖ్య అతిథిగా విచ్చేశారు. ‘స్టయిల్‌ ఐకాన్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డును దక్షిణాది నటి సమంతా అక్కినేని చేతులు మీదుగా అందుకున్నారు.

ఈ సందర్భంగా కరీనా మాట్లాడుతూ, సామాజిక మాధ్యమాల్లో తాను అంత యాక్టివ్‌గా లేకున్నా ఈ అవార్డు దక్కడం చాలా ఆనందంగా ఉందని చెప్పారు. ఈ అవార్డు కారణంగా అమరావతి నగరాన్ని చూడగలిగానని, అమరావతి నగరం అద్భుతంగా ఉందని కితాబిచ్చారు. కాగా, సమంత అక్కినేని ‘మోస్ట్‌ లైక్డ్‌ సౌత్‌ ఇండియన్‌ యాక్ట్రెస్‌’ అవార్డును మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చేతులు మీదుగా అందుకున్నారు.

అనంతరం ఆమె మాట్లాడుతూ అమరావతి గురించి రోజూ ఏదో ఒక స్ఫూర్తిదాయక సమాచారం వింటున్నానని, ఎప్పటి నుంచో ఇక్కడికి రావాలనుకున్నానని, ఇన్నాళ్లకు అవకాశం వచ్చిందని చెప్పారు. ‘మోస్ట్‌ లైక్డ్‌ సౌత్‌ ఇండియన్‌ మ్యూజీషియన్‌ ఆన్‌ సోషల్‌ మీడియా’ అవార్డు సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌ అందుకున్నారు. కార్యక్రమంలో హీరోయిన్‌ హెబ్బాపటేల్‌ నృత్యాలు, శివారెడ్డి మిమిక్రీ ఆహూతులను అరించాయి.

More Telugu News