Kosigi: "నువ్వు అందంగా లేవు... నీ చెల్లిని పంపు"... భర్త వేధింపులతో మహిళ ఆత్మహత్యాయత్నం!

  • ఈ సంవత్సరం ప్రారంభంలో పెళ్లి
  • ఆపై కొన్ని రోజులకే భర్త వేధింపులు
  • పుట్టింటికి వచ్చి పురుగుల మందు తాగిన యువతి

వివాహమైన కొన్నాళ్లకే, "నువ్వు అందంగా లేవు... నీ చెల్లిని నాకిచ్చి పెళ్లి చెయ్యి. అందుకు నీ తల్లిదండ్రులను ఒప్పించు" అంటూ భర్త వేధిస్తుంటే, భరించలేని ఓ యువతి పురుగుల మందుతాగి ఆత్మహత్యాయత్నం చేసింది. పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల మేరకు, కోసిగికి చెందిన కిష్టప్ప, లక్ష్మి దంపతుల కుమార్తె లింగమ్మను ఈ సంవత్సరం ప్రారంభంలో మల్లేష్ కు ఇచ్చి పెళ్లి చేశారు. ఆపై కొంతకాలానికే అతనిలోని మృగాడు కదిలాడు. భార్య అందంగా లేదని, ఆమె చెల్లెలిపై కన్నేశాడు. చెల్లినిచ్చి పెళ్లి చేయకుంటే పుట్టింటికి వెళ్లిపోవాలని వేధించాడు.

భర్త సూటిపోటి మాటలకు తాళలేక, దీపావళి నాడు లింగమ్మ పుట్టింటికి వచ్చి విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. వారు నచ్చజెప్పి ఆమెను భర్త వద్దకు వెళ్లాలని చెప్పారు. నేడు ఆమెను భర్త వద్దకు పంపే ఏర్పాట్లు చేస్తుండటంతో గత రాత్రి పురుగుల మందు తాగింది. ఆమెను గమనించిన కుటుంబీకులు హుటాహుటిన ఆదోని ఆసుపత్రికి తరలించగా, వైద్యులు చికిత్స చేస్తున్నారు. లింగమ్మ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.

More Telugu News