Bhadradri Kothagudem District: నేనెవరో తెలుసా?... తెల్లారేసరికి ట్రాన్స్ ఫరే: కొత్తగూడెం పోలీసులకు బెదిరింపులు!

  • కొత్తగూడెం సూపర్ బజార్ సెంటర్ లో వీరంగం
  • కౌన్సిలర్ కుమారుడు సహా నలుగురు అరెస్ట్
  • కేసు నమోదు చేసిన పోలీసులు

విధి నిర్వహణలో ఉన్న కొత్తగూడెం పోలీసులపై ఓ రాజకీయ నేత కుమారుడు రెచ్చిపోయాడు. పూటుగా మద్యం తాగడంతో పాటు, ఇంటికి వెళ్లాలని కోరినందుకు నానాయాగీ చేశాడు. కొత్తగూడెం త్రీటౌన్‌ సీఐ ఆదినారాయణ తెలిపిన వివరాల మేరకు, పట్టణంలోని సూపర్‌ బజార్‌ సెంటర్‌లో అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో 33వ వార్డు కౌన్సిలర్‌ కుమారుడు బాలిశెట్టి పృథ్వీరాజ్‌, అతని స్నేహితులు కృష్ణార్జున్, ఎండి.రఫిక్, బాలిశెట్టి సత్యనారాయణ మద్యం మత్తులో ఉన్నారు.

సెంటర్ లో తమ కారును ఆపి గొడవ చేస్తుండగా, పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్న ఎస్ఐ నరేష్ వచ్చారు. అక్కడి నుంచి వెళ్లిపోవాలని నరేష్ కోరగా, ఎదురు తిరిగిన పృథ్వీరాజ్, "నేను ఎవరో తెలుసా? తెల్లారేసరికి నిన్ను ట్రాన్స్‌ఫర్‌ చేయిస్తాం" అంటూ దుర్భాషలాడారు. దీంతో ఆ నలుగురినీ, అరెస్ట్ చేయబోగా, అప్పుడూ రెచ్చిపోయారు. బలవంతంగా వారిని త్రీటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ కు తరలించిన పోలీసులు, కేసు నమోదు చేశారు.

More Telugu News