LPG cylinder: సామాన్యులను మళ్లీ బాదేసిన కేంద్రం.. ఒకే నెలలో రెండుసార్లు పెరిగిన గ్యాస్ ధర

  • దీపావళి ముగియగానే బాదిన కేంద్రం
  • పది రోజుల వ్యవధిలో రెండుసార్లు పెరిగిన ధర
  • సిలిండర్‌పై రూ. 2 పెంపు

దీపావళి ఇలా ముగిసిందో, లేదో సామాన్యులకు కేంద్రం మరో షాకిచ్చింది. వంట గ్యాస్ ధరను మరో రెండు రూపాయలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ నెలలో గ్యాస్ ధర పెరగడం ఇది రెండోసారి. ఎల్‌పీజీ డీలర్ల కమిషన్ పెరిగిన నేపథ్యంలో గ్యాస్ ధర పెంచుతున్నట్టు ప్రభుత్వం తెలిపింది. పెరిగిన ధరతో ఢిల్లీలో 14.2 కేజీల రాయితీ సిలిండర్ ధర రూ. 507కు పెరిగింది.  

గతేడాది సెప్టెంబరులో 14.2 కేజీలు, 5 కిలోల సిలిండర్లను సరఫరా చేసే ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్ల కమిషన్ వరుసగా రూ.48.89, రూ. 24.20గా ఉండేది. అయితే, పెరుగుతున్న రవాణ, కూలి ఖర్చుల నేపథ్యంలో డిస్ట్రిబ్యూటర్లకు ఇచ్చే కమిషన్‌ను పెంచుతున్నట్టు చమురు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఫలితంగా 14.2 కిలోల సిలిండర్‌కు ఇచ్చే కమిషన్‌ను రూ.50.858కి, 5 కేజీల సిలిండర్‌పై ఇచ్చే కమిషన్‌ను రూ.25.29కు పెంచుతున్నట్టు తెలిపింది. ఈనెల 1న కేంద్రం వంట గ్యాస్ ధరను రూ.2.94 పెంచింది. మళ్లీ రెండు వారాలు కూడా గడవకముందే మరో రూ.2లు పెంచడం గమనార్హం.

More Telugu News