kanakamedala: దేశ వ్యాప్తంగా మోదీ వ్యతిరేక పవనాలు కనిపిస్తున్నాయి: టీడీపీ ఎంపీ కనకమేడల

  • బీజేపీయేతర పక్షాలను సంఘటితం చేయడంలో చంద్రబాబు చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి
  • రాష్ట్రాలపై కేంద్రం వివక్ష చూపుతోంది
  • ఇంత తీవ్రస్థాయిలో ఉద్యమం నిర్వహించడం దేశ చరిత్రలో తొలిసారి

కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ నియంతృత్వ పోకడలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా బీజేపీయేతర పక్షాలను సంఘటితం చేయడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చర్యలు సత్ఫలితాలనిస్తున్నట్లు టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ పేర్కొన్నారు. దేశంలోని వివిధ పార్టీలను కూడగట్టడంలో చంద్రబాబు తీసుకుంటున్న చొరవకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తున్నట్లు తెలిపారు.

కేంద్రం నియంతృత్వంగా వ్యవహరిస్తూ రాష్ట్రాల పట్ల వివక్ష చూపుతోందన్నారు. ఇది ఫెడరల్ వ్యవస్థకు విఘాతం కలిగిస్తుందని హెచ్చరించారు. రాష్ట్రానికి ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా 5 కోట్ల ఆంధ్రప్రజల మనోభావాలతో ఆడుకుంటున్నరని విమర్శించారు. ప్రధాన మంత్రి మాటలు తాము నమ్మామని, ప్రధాని మాటలు నమ్మకూడని పరిస్థితి వస్తుందని తాము అనుకోలేదని అన్నారు.

కేంద్రానికి వ్యతిరేకంగా ఒక రాష్ట్రం ఇంత తీవ్రస్థాయిలో ఉద్యమం నిర్వహించడం దేశ చరిత్రలో ఇదే మొదలన్నారు. చంద్రబాబు నాయుడు నాయకత్వాన వివిధ పార్టీలను కూడగట్టడం ఆంధ్ర ప్రజల మనోభావాలు ప్రతిబింబించే విధంగా ఉందన్నారు. కర్ణాకటలో ఉప ఎన్నికల ఫలితాలు బీజేపీని చావు దెబ్బతీశాయన్నారు. ఇది శుభ సూచకంగా పేర్కొన్నారు. దేశంలో త్వరలో జరగబోయే సాధారణ ఎన్నికల ఫలితాలను ఇవి సూచిస్తున్నాయన్నారు. దేశ వ్యాప్తంగా మోదీ వ్యతిరేక పవనాలు కనిపిస్తున్నాయని చెప్పారు.

More Telugu News