Telangana: ఆ 8 సీట్లను ఇవ్వకపోతే ఎన్నికల్లో పోటీ చేయను.. కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి అల్టిమేటం!

  • అధిష్ఠానంపై రేవంత్ అలక
  • హామీల అమలులో నిర్లక్ష్యంపై ఆగ్రహం
  • పోటీ నుంచి తప్పుకుంటానని వార్నింగ్

కాంగ్రెస్ పార్టీలో టికెట్ల పంపిణీ వ్యవహారం సంక్లిష్టంగా మారుతోంది. చాలామంది నేతలు తమతో పాటు అనుచరులకు సైతం పార్టీ టికెట్లు ఇవ్వాలని మొండిపట్టు పడుతున్నారు. దీనికితోడు ప్రజాకూటమిలో మిత్ర పక్షాలకు కొన్ని కీలక సీట్లను కేటాయించాల్సి రావడంతో కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం మల్లగుల్లాలు పడుతోంది. ఇప్పటికే 74 మంది అభ్యర్థుల పేర్లను ఖరారు చేసిన హైకమాండ్.. పోటీ తీవ్రంగా ఉన్న మరో 19 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించలేదు.

ఈ నేపథ్యంలో తన అనుచరుడు చిరుమర్తి లింగయ్యకు నకిరేకల్ టికెట్‌ ఇవ్వకపోతే తాము పోటీ నుంచి తప్పుకుంటామని కోమటిరెడ్డి సోదరులు ప్రకటించారు. తాజాగా ఈ జాబితాలోకి తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి చేరారు. కాంగ్రెస్ పార్టీలో చేరిక సందర్భంగా ఇచ్చిన ఏ హామీని హైకమాండ్ పట్టించుకోవడం లేదని రేవంత్ అలకబూనారు. ఈ ఎన్నికల్లో తన అనుచరులకు టికెట్లు ఇవ్వకపోతే పోటీ నుంచి తప్పుకోవడానికి వెనుకాడబోనని స్పష్టం చేశారు. రేవంత్ తన అనుచరుల కోసం ప్రధానంగా 8 సీట్లు కోరుతున్నట్లు తెలుస్తోంది. అవి

1. వరంగల్ పశ్చిమం (నరేందర్ రెడ్డి)
2. నిజామాబాద్ గ్రామీణం (అరికెల నర్సారెడ్డి)
3. ఆర్మూరు (రాజారామ్ యాదవ్) 
4. ఎల్లారెడ్డి (సుభాష్ రెడ్డి) 
5. దేవరకొండ (బిల్యా నాయక్) 
6. ఇల్లందు (హరిప్రియ)  
7. సూర్యాపేట (పటేల్ రమేష్ రెడ్డి)  
8. చెన్నూరు (బోడ జనార్దన్)

More Telugu News