Telangana: జనగామ సీటు టీజేఎస్ కు.. తీవ్రంగా స్పందించిన పొన్నాల లక్ష్మయ్య!

  • మీడియాలో వస్తున్న వార్తలు నిజంకాదు
  • ఇలాంటి ప్రచారంతో తీవ్ర నష్టం జరుగుతుంది
  • అవసరమైతే హైకమాండ్ తో మాట్లాడతా

తెలంగాణ ఎన్నికల్లో తాను పోటీ చేసిన జనగామ టికెట్ ను తెలంగాణ జన సమితి (టీజేఎస్)కి కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం కేటాయించినట్లు వస్తున్న వార్తలపై సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య తీవ్రంగా స్పందించారు. ఇలాంటి ప్రచారం పార్టీకి తీవ్ర నష్టం చేకూరుస్తుందని హెచ్చరించారు. కాంగ్రెస్ హైకమాండ్ టీజేఎస్ కు జనగామ టికెట్ ను కేటాయించలేదని స్పష్టం చేశారు.

ఒకవేళ టీజేఎస్ కు తన నియోజకవర్గాన్ని అప్పగిస్తే అధికార టీఆర్ఎస్ కు లాభం చేకూరుతుందని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ లో ఈ రోజు మీడియాతో పొన్నాల మాట్లాడారు. ఒకవేళ జనగామ అసెంబ్లీ నియోజకవర్గాన్ని త్యాగం చేయాలని కాంగ్రెస్ పార్టీ కోరితే తాను హైకమాండ్ తో మాట్లాడుకుంటానని స్పష్టం చేశారు. తనలాంటి బీసీ నేతలకు అన్యాయం చేయడం సరికాదన్నారు.

రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలంటే వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లాలని సూచించారు. ఇందుకోసం అన్ని పక్షాలను కలుపుకుని పోవడం అవసరమని అభిప్రాయపడ్డారు. ప్రజాకూటమి విజయానికి కార్యకర్తలంతా కలసికట్టుగా పని చేయాలని సూచించారు. ఒకవేళ కోదండరాం అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటే జనగామ టికెట్ ను ఇస్తామని కాంగ్రెస్ అధిష్ఠానం హామీ ఇచ్చినట్లు సమాచారం.

More Telugu News