Telangana: చంద్రబాబుతో పాటు ఆ అధికారులను కూడా కోర్టుకు ఈడుస్తాం!: బీజేపీ నేత జీవీఎల్ వార్నింగ్

  • ఎన్నికల్లో ఓడిపోతామని చంద్రబాబుకు తెలుసు
  • ఆయన దుబారా ఖర్చులను టీడీపీనే భరించాలి
  • పాల వ్యాపారంపై ఉన్న శ్రద్ధ పరిపాలనపై లేదు

2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలవలేమని భావించిన చంద్రబాబు వేరే రాష్ట్రాలకు టూర్లు వేస్తున్నారని బీజేపీ నేత జీవీఎల్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. చంద్రబాబు స్పెషల్ ఫ్లైట్లు, స్పెషల్ హెలికాప్టర్లు, లగ్జరీ హోటళ్ల ఖర్చులను ఏపీ ప్రజలు ఎందుకు భరించాలని ప్రశ్నించారు. టీడీపీ నేతలు ఎక్కడ చర్చలకు ఆహ్వానించినా పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.

చంద్రబాబు పాల వ్యాపారం పట్ల చూపిస్తున్న శ్రద్ద పరిపాలనపై చూపించడం లేదని ఎద్దేవా చేశారు. ఇతర రాష్ట్రాలతో పాటు విదేశీ పర్యటనలకు చంద్రబాబు తన పార్టీ నిధులను వాడుకోవాలని సూచించారు. విజయవాడలో బీజేపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో జీవీఎల్ టీడీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.

చంద్రబాబు ప్రభుత్వం ఏపీలో ధర్మపోరాట దీక్షల పేరుతో దొంగ పోరాటాలు చేస్తోందని జీవీఎల్ వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమాలతో భారీగా ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి చర్యలు ప్రజలను మోసం చేయడమేనని అభిప్రాయపడ్డారు.

ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన నేతలు, అధికారులను కోర్టుకు ఈడుస్తామని హెచ్చరించారు. విశాఖపట్నంలో భూకుంభకోణంపై సిట్ 9 నెలల క్రితం రిపోర్టు ఇస్తే ఇప్పుడు అందులో మార్పులు చేసి తీరిగ్గా బయటపెడుతున్నారని ఆరోపించారు. మంత్రి గంటా శ్రీనివాసరావును రక్షించేందుకే చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారని విమర్శించారు.

More Telugu News