Andhra Pradesh: సెలవు ఇవ్వకుండా సీఐ వేధింపులు.. మనస్తాపంతో సముద్రంలోకి దూకిన కానిస్టేబుల్!

  • విశాఖపట్నం జిల్లాలో ఘటన
  • కొత్తవలసలో కానిస్టేబుల్ గా ఉన్న శ్రీనివాస్
  • సెలవు కోరితే ఉద్యోగం మానేయాలని సీఐ వేధింపులు

అవిశ్రాంతంగా విధులు నిర్వహించడం, సెలవు కోరినా ఉన్నతాధికారులు ఇవ్వకపోవడంపై మనస్తాపం చెందిన ఓ పోలీస్ కానిస్టేబుల్ తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు. ఉన్నతాధికారుల ప్రవర్తనపై మనస్తాపం చెంది ప్రాణాలు తీసుకునేందుకు యత్నించాడు. ఈ ఘటన విశాఖపట్నంలో చోటుచేసుకుంది.

విజయనగరం జిల్లా కొత్తవలస పోలీస్ స్టేషన్ లో ఇ.శ్రీనివాసరావు అనే యువకుడు పోలీస్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు. గత కొంతకాలంగా సెలవులు లేకుండా అవిశ్రాంతంగా అతను పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో తనకు కొన్నిరోజులు సెలవులు కావాలనీ, ఓసారి ఇంటికి వెళ్లివస్తానని శ్రీనివాసరావు స్టేషన్ సీఐని కోరారు. అయితే సెలవు కావాలనుకుంటే ఉద్యోగం మానేయాలని సీఐ రెడ్డి శ్రీనివాసరావు అతనికి స్పష్టం చేశారు.

దీంతో తీవ్ర మనస్తాపానికి లోనైన బాధితుడు విశాఖ ఆర్కే బీచ్ వద్ద సముద్రంలోకి దూకి ఆత్మహత్యకు యత్నించారు. అయితే అక్కడే ఉన్న ఈతగాళ్లు శ్రీనివాసరావును కాపాడి విశాఖ కేజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన విశాఖపట్నం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News