Andhra Pradesh: కోడి కత్తి దాడి ఘటనపై ఏం చెప్పాలో జగన్ కు అర్థం కావడం లేదు!: టీడీపీ నేత బుద్ధా వెంకన్న

  • అందుకే ప్రజల ముందుకు రావడం లేదు
  • కనీసం జాతీయ మీడియాకైనా ఇంటర్వ్యూ ఇచ్చాడా
  • భుజానికి గాయమైతే పాదయాత్ర ఆపడం ఎందుకు?

కోడి కత్తి డ్రామా జరిగి 15 రోజులైనా ఏపీ ప్రతిపక్ష నేత జగన్ ఎందుకు మాట్లాడటం లేదని టీడీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ప్రశ్నించారు. స్క్రిప్ట్ రెడీ కానందునే జగన్ మీడియా ముందుకు రాలేదని వెల్లడించారు. తెలుగు ఛానల్స్ అంటే జగన్ కు ఇష్టం లేదని, కనీసం ఇంగ్లిష్ ఛానల్స్ కు అయినా ఇవ్వొచ్చు కదా!  అని సూచించారు. విజయవాడ టీడీపీ కార్యాలయంలో ఈ రోజు నిర్వహించిన మీడియా సమావేశంలో బుద్ధా వెంకన్న మాట్లాడారు.

ఈ కోడి కత్తి దాడిని వైసీపీ అధినేత జగన్ తనపై తాను చేయించుకున్నారని ఆరోపించారు. ఈ విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిపోయిందనీ, అందువల్లే ముఖం చూపించలేక ఆయన మీడియా ముందుకు రావడం లేదని దుయ్యబట్టారు. ప్రజాసంకల్ప యాత్ర, బహిరంగ సభల్లో మాట్లాడుతానని చెప్పిన జగన్ సైలెంట్ అయిపోవడం వెనుక అంతర్యం ఏంటని ప్రశ్నించారు.

కోడికత్తి దాడిపై ప్రజలకు ఏం చేప్పాలో జగన్ కు అర్థం కావడం లేదన్నారు. కాలికి గాయమైతే పాదయాత్ర ఆపడంలో అర్థం ఉందనీ, కానీ భుజానికి గాయమైతే ఇంతకాలం ఆగిపోవడం ఏంటని ప్రశ్నించారు.

More Telugu News