Kerala: ప్రాణంగా ప్రేమించిన భార్య కోసం గుండు కొట్టించుకున్న భర్త... వైరల్ అవుతున్న ప్రణయ గాధ!

  • పెళ్లయిన కొద్ది రోజులకే భార్యకు క్యాన్సర్
  • చికిత్సలో భాగంగా జుట్టు ఊడిపోవడంతో గుండు కొట్టించుకున్న భర్త
  • మ్యారేజ్ డే సందర్భంగా ఫేస్ బుక్ లో పోస్టు

అసలైన ప్రేమంటే... ప్రేమించి పెళ్లి చేసుకోవడమే కాదు... భార్య కష్టాన్ని పంచుకోవాలని కూడా నిరూపించాడో కేరళ యువకుడు. నెట్టింట అతని జీవిత కథ ఇప్పుడు వైరల్ అవుతోంది. మరిన్ని వివరాల్లోకి వెళితే, కేరళలోని త్రిసూరు ప్రాంతానికి చెందిన షాన్ ఇబ్రహిం బాద్షా, శ్రుతిలు కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి లవ్ లో ఉన్నారు.

గత సంవత్సరం పెద్దలను ఒప్పించి వివాహం చేసుకోగా, పెళ్లయిన కొన్ని రోజులకే శ్రుతి అనారోగ్యం గురించిన భయంకర నిజం షాన్ కు తెలిసింది. ఆమెను పరీక్షించిన వైద్యులు, క్యాన్సర్ సోకిందని చెప్పడంతో తట్టుకోలేకపోయిన షాన్, రోధించాడు. ఆమెను బతికించుకోవాలన్న తాపత్రయంతో, అన్ని సేవలూ చేశాడు. అతని ప్రేమ ఆమెకు ఊపిరి పోసింది.

శ్రుతికి కీమోథెరపీ ప్రారంభించిన వేళ, ఆమె జుట్టంతా ఊడిపోగా, తన భార్యకు లేని తల వెంట్రుకలు తనకు కూడా వద్దని చెబుతూ, గుండు చేయించుకున్నాడు. శృతి క్యాన్సర్ నుంచి కోలుకోగా, వీరి తొలి మ్యారేజ్ డే సందర్భంగా, తమ ప్రేమకథను, పడ్డ కష్టాలను వివరిస్తూ, ఫేస్‌ బుక్‌ లో ఓ పోస్ట్ పెట్టాడు. దీంతో వీరిద్దరి ప్రేమకథ వెలుగులోకి వచ్చి వేలకొద్దీ షేర్లు, లక్షల కొద్దీ లైక్ లను తెచ్చుకుంది.

More Telugu News