chattisgarh: నలుగురు ఓటర్ల కోసం ప్రత్యేక పోలింగ్‌ బూత్‌: చత్తీస్‌గఢ్‌లో ప్రత్యేకం

  • వీరిలో ముగ్గురు ఒకే కుటుంబానికి చెందిన వారు
  • భరత్‌పూర్‌-సోన్‌హట్‌ అసెంబ్లీ నియోజకవర్గంలోని షిరందఢ్‌ గ్రామంలో ఏర్పాటు
  • దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న గ్రామం

మావోయిస్టుల ప్రభావం తీవ్రంగా ఉండే చత్తీస్‌గఢ్‌లో పోలింగ్‌ బూత్‌ల ఏర్పాటు అధికారులకు సవాల్‌గా మారింది. వంద శాతం ఓటింగ్‌ నమోదుకు కృషి చేస్తున్న ఎన్నికల కమిషన్‌ మారుమూల ప్రాంతాల్లో కూడా పోలింగ్‌ బూత్‌ల ఏర్పాటుకు కృషి చేస్తోంది. ఇందుకు భరత్‌పూర్‌-సోన్‌హట్‌ అసెంబ్లీ నియోజకవర్గంలోని షిరందఢ్‌ గ్రామంలో ఏర్పాటు చేస్తున్న బూత్‌ ఓ ఉదాహరణ. ప్రధాన రహదారికి పదిహేను కిలోమీటర్ల దూరంలో దట్టమైన అటవీ ప్రాంతంలో ఈ గ్రామం ఉంది. ఈ గ్రామానికి వెళ్లాలంటే ఐదారు కిలోమీటర్లు కొండెక్కాలి.

అనంతరం ఓ నది దాటితేగాని ఈ గ్రామానికి చేరుకోలేం. ఇంత కష్టపడి ఏర్పాటు చేసిన బూత్‌ పరిధిలో ఉన్నది కేవలం నలుగురు ఓటర్లు మాత్రమే. అందులోనూ ముగ్గురు ఒకే కుటుంబానికి చెందిన వారు. చత్తీస్‌గఢ్‌లో రెండు విడతల్లో పోలింగ్‌ జరగనుంది. తొలి దశలో పోలింగ్‌ 12వ తేదీన జరగనుండగా ఇక్కడి ఓటర్లు ఆ రోజు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇందుకోసం 143వ నంబరు పోలింగ్‌ బూత్‌ ఏర్పాటు చేశామని, ఎన్నికలకు ఒక రోజు ముందు ఆ గ్రామం వెళ్లి టెంట్‌ ఏర్పాటు చేస్తామని ఎన్నికల అధికారి ఎన్‌.కె.దుగ్గా తెలిపారు.

More Telugu News