Maharashtra: డ్యూటీలో ఉన్న ఎస్ఐని వాహనంతో తొక్కించి చంపిన మద్యం మాఫియా

  • మహారాష్ట్రలో ఘటన
  • తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో మృతి చెందిన ఎస్సై
  • నిందితుల కోసం గాలిస్తున్న పోలీసులు

మద్యం మాఫియా ఆగడాలకు అంతుపొంతు లేకుండా పోతోంది. విధుల్లో ఉన్న ఓ ఎస్సైని లిక్కర్ స్మగ్లర్లు వాహనంతో తొక్కించి చంపారు. మహారాష్ట్రలోని చంద్రాపూర్‌లో ఈ దారుణం జరిగింది. మద్యం అక్రమ రవాణా పెద్ద ఎత్తున జరుగుతుండడంతో ఎస్సై చత్రపతి చిడే మరో నలుగురు పోలీసులతో కలిసి మౌషి-చోర్గో గ్రామ సమీపంలోని గోసిఖుర్ద్ కెనాల్ రోడ్‌లో వాహనాలు తనిఖీ చేస్తుండగా బ్రహ్మపురి వైపు వేగంగా వెళ్తున్న ఎస్‌యూవీని ఆపే ప్రయత్నం చేశారు.

వాహనం దగ్గరికి వెళ్లేందుకు పోలీసులు ప్రయత్నిస్తుండగా ఎస్‌యూవీ డ్రైవర్ అకస్మాత్తుగా వాహనాన్ని వెనక్కి తిప్పి చత్రపతి చిడేపై ఎక్కించాడు. వెనక చక్రాల కింద నలిగిపోయి తీవ్ర గాయాలపాలైన చిడేను వెంటనే బ్రహ్మపురి ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ చిడే మృతి చెందారు. నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు ఎస్‌యూవీ, దాని డ్రైవర్ కోసం గాలిస్తున్నారు.

More Telugu News