gali janardhan reddy: గాలి జనార్దనరెడ్డికి మరో షాక్.. లుకౌట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు!

  • ఈడీ దర్యాప్తు నుంచి బయటపడేస్తానంటూ ఓ కంపెనీకి హామీ
  • రూ. 18 కోట్ల విలువైన 57 కేజీల బంగారాన్ని సమర్పించుకున్న సయ్యద్
  • ‘గాలి’ కోసం వేట ముమ్మరం చేసిన పోలీసులు

పరారీలో ఉన్న బీజేపీ నేత, కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన రెడ్డికి మరో షాక్ తగిలింది. జనార్దన రెడ్డి పరారీలో ఉన్నట్టు తాజాగా ప్రకటించిన పోలీసులు అతడి కోసం లుకౌట్ నోటీసు జారీ చేశారు. ప్రస్తుతం ఆయన కోసం బెంగళూరు పోలీసులు, సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ ముమ్మరంగా గాలిస్తోంది.

2016-17లో ఆంబిడెంట్ గ్రూప్ పేరుతో ఓ కంపెనీని ఏర్పాటు చేసిన సయ్యద్ అహ్మద్ ఫరీద్ వందలాదిమంది పెట్టుబడిదారులను నమ్మించి రూ.600 కోట్లు వసూలు చేశాడు. హామీలు నిలబెట్టుకోవడంలో విఫలమైన కంపెనీపై కొందరు పెట్టుబడిదారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. జనవరి 2017లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆంబిడెంట్ కార్యాలయంలో సోదాలు నిర్వహించింది. కాగా, ఈ కేసు తాజాగా కర్ణాటక క్రైమ్ బ్రాంచ్ పోలీసుల చేతుల్లోకి వెళ్లింది.

ఆంబిడెంట్ వ్యవస్థాపకుడు సయ్యద్ అహ్మద్‌ను ఇటీవల పోలీసులు ప్రశ్నించగా సంచలన విషయాలు బయటపడ్డాయి. ఈడీ నుంచి తనకు ఇబ్బందులు ఎదురు కాకుండా మాజీ మంత్రి గాలి జనార్దనరెడ్డి సాయం చేస్తానంటే రమేశ్ కొఠారీ అనే బంగారం వ్యాపారి ద్వారా రూ. 18 కోట్ల విలువైన 57 కేజీల బంగారాన్ని సమర్పించుకున్నట్టు చెప్పాడు. ఈ కేసులో జనార్దనరెడ్డి పీఏ అలీఖాన్, జనార్దనరెడ్డిల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

More Telugu News