New Delhi: తాగుబోతు నిర్వాకం.. కాలి బూడిదైన 18 వాహనాలు!

  • ఢిల్లీలోని మదన్ గిర్ ప్రాంతంలో ఘటన
  • బైక్ లకు నిప్పు పెట్టిన ప్రబుద్ధుడు
  • కేసు నమోదుచేసిన పోలీసులు

దేశరాజధానిలో పూటుగా మందుకొట్టిన ఓ ఆకతాయి రెచ్చిపోయాడు. వాహనాల ట్యాంకు మూతలు తెరిచి అగ్గిపెట్టెతో మంట పెట్టాడు. ఈ ఘటనలో 18 వాహనాలు కాలిబూడిద అయ్యాయి. వాహనాలకు మంటపెట్టిన అనంతరం నిందితుడు ఘటనాస్థలం నుంచి పరారయ్యాడు. ఈ ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది.

ఇక్కడి మదన్ గిర్ ప్రాంతంలో ఈ రోజు ఉదయం 3.05 గంటలకు రోడ్డుపై పార్క్ చేసిన బైక్ లు, కార్ల వద్దకు వచ్చిన నిందితుడు.. తొలుత బైక్ ఆయిల్ ట్యాంక్ మూతలను విప్పాడు. అనంతరం అగ్గిపుల్లతో మంటపెట్టాడు. ఈ మంటలు ఒక్కసారిగా అన్ని బైక్ లకు వ్యాపించడంతో అక్కడి నుంచి పారిపోయాడు.

అయితే మంటలు అక్కడితో ఆగకుండా పక్కనే పార్క్ చేసిన కార్లకు సైతం అంటుకున్నాయి. దీంతో 14 టూ వీలర్లు, 4 కార్లు కాలి బూడిద అయ్యాయి. మంటలు చూసిన కొందరు స్థానికులు పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్టు, పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. 

More Telugu News