Pawan Kalyan: విజయవాడలో టీడీపీ-జనసేన ప్లెక్సీల రచ్చ.. ఆరా తీసిన పవన్ కల్యాణ్!

  • పవన్ కు వ్యతిరేకంగా టీడీపీ పోస్టర్లు
  • కౌంటర్ గా ప్లెక్సీలు ఏర్పాటుచేసిన జనసేన
  • కౌన్సెలింగ్ ఇవ్వాలనుకుంటున్న పోలీసులు

కృష్ణా జిల్లా విజయవాడలో టీడీపీ, జనసేన పార్టీల మధ్య ప్లెక్సీలు, పోస్టర్ల యుద్ధం నడుస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ వివాదం జనసేన అధినేత పవన్ కల్యాణ్ దృష్టికి వెళ్లింది. దీంతో పార్టీ సీనియర్ నేతలను పిలిపించుకున్న పవన్ అసలు ఏం జరుగుతోందని ప్రశ్నించారు. ఈ సందర్భంగా టీడీపీ నేత కాట్రగడ్డ బాబు చేసిన విమర్శలను పార్టీ వర్గాలు ఆయన దృష్టికి తీసుకెళ్లాయి.

మరోవైపు టీడీపీ నాయకులకు దమ్ముంటే వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి గెలవాలని జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేశ్‌ ఈ రోజు సవాల్‌ విసిరారు. ప్రచారం కోసమే కొందరు టీడీపీ నాయకులు పవన్ కు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారని విమర్శించారు. రౌడీషీటర్‌, నగర బహిష్కరణకు గురైన కాట్రగడ్డ బాబు తమ నాయకుడిని విమర్శించడం హాస్యాస్పదమన్నారు.

టీడీపీ నాయకులు ఇష్టానుసారం ప్లెక్సీలు కడుతుంటే మున్సిపల్ అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. కిరాయి హత్యలు చేసే కాట్రగడ్డ బాబు పవన్ ను విమర్శించడం విడ్డూరమన్నారు. విజయవాడలో టీడీపీ, జనసేన నేతలు పరస్పరం విమర్శించుకుంటూ పోస్టర్లు, ప్లెక్సీలు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరువర్గాలకు కౌన్సెలింగ్ ఇవ్వాలని పోలీసులు భావిస్తున్నారు.

More Telugu News