Pawan Kalyan: పవన్.. దమ్ముంటే నాకు పేకాట క్లబ్బులు ఎక్కడున్నాయో చూపించు!: టీడీపీ ఎమ్మెల్యే వర్మ సవాల్

  • పవన్ హుందాగా మాట్లాడాలి
  • ఆయన వాస్తవాలు తెలుసుకోవాలి
  • పవన్ కారణంగానే కాకినాడ రైతులపై కేసులు

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రజాప్రతినిధులను బ్రోకర్లు అంటూ సంబోధించడాన్ని పిఠాపురం ఎమ్మెల్యే, టీడీపీ నేత ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్రంగా తప్పుబట్టారు. ఓ పార్టీ అధ్యక్షుడిగా పవన్ హుందాగా మాట్లాడాలని సూచించారు. ప్రసంగాలు ఇచ్చేముందు పవన్ ఓసారి వాస్తవాలను సరిచూసుకోవాలని హితవు పలికారు. తనకు పేకాట క్లబ్బులు ఉన్నట్లు పవన్ కల్యాణ్ ఆరోపించారనీ, దమ్ముంటే అవి ఎక్కడ ఉన్నాయో చూపాలని సవాల్ విసిరారు.

అసలు కాకినాడలో సెజ్ వ్యవహారంలో భూములు కోల్పోయిన రైతులపై కేసులు పెట్టడానికి పవన్ కల్యాణే కారణమని వర్మ ఆరోపించారు. కాకినాడలో రైతన్నలపై కేసులు పెట్టించింది అప్పటి ప్రజారాజ్యం ఎమ్మెల్యేనని గుర్తుచేశారు. నిన్నరాత్రి పిఠాపురంలోని ఉప్పాడ సెంటర్ లో ఎమ్మెల్యే వర్మపై పవన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

గొల్లప్రోలు శానిటరీ ఇన్ స్పెక్టర్ శివలక్ష్మి చేతులతో ఎమ్మెల్యే మురుగు తీయించడంపై స్పందిస్తూ.. ఆడపడుచులను ఈ రకంగా అవమానించి, దాడి చేస్తారా? అంటూ పవన్ ఘాటుగా విమర్శించారు. పిచ్చిపిచ్చి వేషాలు వేస్తే తోలు తీస్తామని హెచ్చరించారు. ప్రజలేమీ బానిసలు కాదని వ్యాఖ్యానించారు.

More Telugu News