Telangana: ప్రియురాలికి అఫైర్ అంటగట్టిన యువకుడు.. మనస్తాపంతో ప్రాణాలు తీసుకున్న యువతి!

  • హైదరాబాద్ లోని శాంతినగర్ లో ఘటన
  • ఆరేళ్లుగా ప్రేమించుకుంటున్న జంట
  • మరో యువకుడితో మాట్లాడుతోందని వేధింపులు

జీవితాంతం తోడుగా ఉంటానని మాట ఇచ్చిన యువకుడు ప్రియురాలిపై అనుమానం పెంచుకున్నాడు. ఆమె మరో యువకుడితో చనువుగా ఉంటోందని వేధించసాగాడు. అక్కడితో ఆగకుండా చేయి కూడా చేసుకున్నాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి లోనైన బాధితురాలు, తన ప్రాణాన్ని తీసుకుంది. ఈ ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది.

నగరంలోని శాంతినగర్ లో వాణి (23) అనే యువతి తన కుటుంబంతో కలిసి ఉంటోంది. ఈ నేపథ్యంలో అదే ప్రాంతానికి చెందిన కన్నం భరత్, వాణి గత ఆరేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అన్న పెళ్లికాగానే వివాహం చేసుకుందామని నమ్మబలికాడు. ఇందుకు యువతి కూడా అంగీకరించింది. అయితే గత మూడు నెలలుగా మరో యువకుడితో వాణి చనువుగా ఉంటోందని భరత్ అనుమానించడం మొదలుపెట్టాడు. ఈ నేపథ్యంలో పూటుగా మద్యం తాగిన భరత్ యువతిని కలుసుకున్నాడు.

అనంతరం బలవంతంగా తన ఇంటికి బైక్ పై తీసుకొచ్చాడు. ఎవరితో మాట్లాడుతున్నావ్? వాడు ఎవడు? అంటూ తీవ్రంగా వేధించాడు. దీంతో బాధితురాలు తీవ్ర ఆవేదనకు లోనయింది. ఇంటికి చేరుకున్న యువతి వాణి మనస్తాపంతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కాగా, ఈ ఘటనపై బాధితురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News