Hyderabad: హైదరాబాద్ మెట్రో స్టేషన్ పైనుంచి దూకిన మహిళ!

  • విక్టోరియా మెమోరియల్ స్టేషన్ లో ఘటన
  • కుటుంబ కలహాలతోనే ఆత్మహత్యాయత్నం
  • కేసు నమోదు చేసిన పోలీసులు

హైదరాబాద్ మెట్రో రైల్వే స్టేషన్ పై నుంచి ఓ మహిళ కిందకు దూకి ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపింది. విక్టోరియా మెమోరియల్ మెట్రోస్టేషన్ పైకి చేరుకున్న ఓ మహిళ, తన కుటుంబ సమస్యల కారణంగా ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఆమెను ఎల్బీ నగర్ లో నివసించే స్వప్నగా పోలీసులు గుర్తించారు.

పై నుంచి కిందపడిన ఆమెకు సంబంధించిన వీడియో ఫుటేజ్, సమీపంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. మహిళ కిందకు దూకడాన్ని చూసిన కొందరు స్థానికులు, ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఆమెకు ప్రాణాపాయం లేదని, ఓ చెయ్యి విరిగిందని వైద్యులు వెల్లడించారు. భర్త రాజేష్ కు దూరంగా ఉంటున్న ఆమె, తన రెండేళ్ల బిడ్డ పెంపకం విషయమై మనస్తాపంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు తెలుస్తోంది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ ప్రారంభించారు.

More Telugu News