Chandrababu: ఎన్నికలు సమీపిస్తున్న వేళ... పలు కీలక నిర్ణయాలు తీసుకున్న చంద్రబాబు సర్కారు!

  • దొనకొండలో మోగా పారిశ్రామిక హబ్
  • రాయలసీమ ఉక్కు కార్పొరేషన్ ఏర్పాటు
  • రూ.22వేల కోట్లతో గ్రామీణ నీటిసరఫరా
  • అన్నా క్యాంటిన్ చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు
  • పీపీపీ విధానంలో విశాఖ మెట్రో
  • అసైన్డ్ భూముల క్రమబద్ధీకరణ 

ఆంధ్రప్రదేశ్ విభజన హామీల అమలు విషయంలో కేంద్రప్రభుత్వ వైఖరిపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి రెండు లేఖలు, తిత్లీ తుపాను సాయంపై కేంద్ర హోం మంత్రికి మరో లేఖ రాయాలని ఏపీ మంత్రి మండలి సమావేశం నిర్ణయించింది. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన మంత్రి మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోగా, వాటి వివరాలను సమాచార శాఖ మంత్రి కాలవ శ్రీనివాసులు మీడియాకు వివరించారు.

విభజన చట్టంలోని అంశాలను అమలు చేయడంలో కేంద్రం జాప్యం చేస్తుందనడం కంటే మోసం చేస్తుందని చెప్పడం సబబని ఆయన అన్నారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిపై పీఎంకు 3 లేఖలు రాయాలని మంత్రి మండలి నిర్ణయించినట్లు తెలిపారు. విభజన ఒప్పందంలో భాగంగా కడపలో స్టీలు ప్లాంటు ఏర్పాటు చేయాల్సి ఉందని, కానీ ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా చేస్తున్న జాప్యాన్ని నిరసిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రానికి మొదటి లేఖ రాయాలని తీర్మానించినట్లు చెప్పారు. కేంద్ర హామీలు అమలు కావడం లేదని, తక్షణం వాటిని అన్నింటినీ అమలు చేయాలని రెండవ లేఖ రాయాలని నిర్ణయించామన్నారు. తిత్లీ తుపాన్ విషయంలో కేంద్ర వైఖరిపై కేంద్ర హోం మంత్రికి ప్రత్యేకంగా మరో లేఖ రాయాలని నిర్ణయించినట్లు తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం ముందుకు రాకపోవడంతో కడప ఉక్కు కర్మాగారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే చేపట్టాలని నిర్ణయించిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వమే వంద శాతం పెట్టుబడి వ్యయాన్ని భరించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు ‘రాయలసీమ స్టీల్ కార్పొరేషన్ లిమిటెడ్’ ఏర్పాటుకు మంత్రి మండలి ఆమోదించిందని చెప్పారు. వచ్చే నెలలో దీనికి పునాదిరాయి వేయాలని కూడా నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

ఈ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టరుగా గతంలో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి సీఎండీగా పని చేసిన పీ మధుసూదన్‌ ను నియమించాలని నిర్ణయించినట్లు చెప్పారు. అవసరమైతే ఈక్విటీకి వెళ్లాలని, ముందుకొచ్చే ప్రైవేటు సంస్థలతో జాయింట్ వెంచర్‌గా ముందుకెళ్లాలని సమావేశం భావించినట్లు తెలిపారు. రాయలసీమ స్టీల్ కార్పొరేషన్ కు ప్రాథమిక పెట్టుబడిగా రూ. 2 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. కడప ఉక్కు ప్లాంటు వ్యయం రూ. 12 వేల కోట్లుగా అంచనా వేసినట్టు కాలువ తెలిపారు.

విభజన చట్టంలో పేర్కొన్న విధంగా విశాఖ మెట్రో ఏర్పాటుకు కేంద్రం ముందుకు రాకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వమే దాని బాధ్యత తీసుకుని సత్వరం ప్రాజెక్టును చేపట్టాలని నిర్ణయించినట్లు ఆయన చెప్పారు. విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్టుకు సబంధించిన ఆర్ఎఫ్పీ, రాయితీ ఒప్పందంపై గతంలో జారీచేసిన ఉత్తర్వులకు ఆమోదం తెలపడంతోపాటు ఆర్ఎఫ్పీ, రాయితీ ఒప్పందాన్ని విడుదల చేయడానికి అమరావతి మెట్రో రైలు కార్పొరేషన్ (ఏఎంఆర్సీ) మేనేజింగ్ డైరెక్టరుకు అనుమతి ఇచ్చినట్లు చెప్పారు.

ప్రకాశం జిల్లా దొనకొండలో మెగా ఇండస్ట్రియల్ హబ్ నిర్మాణానికి 2395.98 ఎకరాల ప్రభుత్వ భూమి ఏపీఐఐసీకీ ఉచితంగా కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. దొనకొండ మండలం రాగమక్కపల్లి, భూమనపల్లి, రుద్రసముద్రం, ఇండ్లచెరువు గ్రామాల పరిధిలోని ఈ భూమిని దొనకొండ మెగా ఇండస్ట్రియల్ హబ్ నిర్మాణం కోసం ప్రకాశం జిల్లా ఏపీఐఐసీ జోనల్ మేనేజర్‌కు అప్పగించే ప్రతిపాదనకు ఆమోదం తెలిపినట్లు చెప్పారు.

More Telugu News