Chandrababu: చంద్రబాబునాయుడు వ్యూహ రచనకు బీజేపీ విలవిలలాడిపోతోంది: డొక్కా మాణిక్యవరప్రసాద్

  • ఇది చారిత్రక విజయం 
  •  ఆ రాష్ట్రాలలోనూ కర్ణాటక ఎన్నికల ఫలితాలే పునరావృతమవుతాయి
  • కాంగ్రెస్-జేడీఎస్ కూటమి విజయం సాధించాలని చంద్రబాబు కోరుకున్నారు

కర్ణాటకలో జరిగిన ఉపఎన్నిక ఫలితాలు బీజేపీకి, ప్రధానమంత్రి నరేంద్రమోదీకి చావు దెబ్బ వంటివని ఏపీ శాసనమండలి ప్రభుత్వ విప్ డొక్కా మాణిక్యవరప్రసాద్ అభిప్రాయపడ్డారు. కర్ణాటక ఎన్నికల ఫలితాలే త్వరలో జరగబోయే తెలంగాణ సహా అయిదు రాష్ట్రాల ఎన్నికల్లోనూ పునరావృతమవుతాయని జోస్యం చెప్పారు. కర్ణాటకలో తాజాగా మూడు లోక్ సభ, రెండు అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు జరిగాయన్నారు. వాటిలో రెండు లోక్ సభ, రెండు అసెంబ్లీ స్థానాలను కాంగ్రెస్-జేడీఎస్ కూటమి గెలుచుకుందన్నారు. ఇది చారిత్రక విజయమన్నారు. కాంగ్రెస్-జేడీఎస్ కూటమి విజయం సాధించాలని సీఎం చంద్రబాబునాయుడు కోరుకున్నారన్నారు.

కొద్ది నెలల కిందట జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఓటేయాలని అక్కడి తెలుగు ప్రజలకు సీఎం చంద్రబాబునాయుడు పిలుపునిచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. తెలుగు ప్రజల ఆగ్రహం ఎలా ఉంటుందో బీజేపీ, పీఎం నరేంద్రమోదీకి కర్ణాటక ఉపఎన్నికల ఫలితాలు మరోసారి తెలిసొచ్చేలా చేశాయన్నారు. సీఎం చంద్రబాబునాయుడు వ్యూహ రచనకు బీజేపీ విలవిలలాడిపోతోందన్నారు. 

2014 ఎన్నికల్లో అభివృద్ధి అజెండాగా సీఎం చంద్రబాబునాయుడుతో కలిసి బీజేపీ, నరేంద్రమోదీ ప్రజల ముందుకెళ్లారన్నారు. ఏపీ పునర్విభజన చట్టం, ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు మోదీ ముఖం చాటేయడంతో, ఎన్డీయే నుంచి టీడీపీ బయటకొచ్చిందన్నారు. సీఎం చంద్రబాబునాయుడి వ్యూహ రచనకు తాళలేక, అభివృద్ధి అజెండా వదలి బీజేపీ నాయకులు మత రాజకీయాలను ముందుకు తీసుకొస్తున్నారని డొక్కా మాణిక్య ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

More Telugu News