Crime News: వికారాబాద్‌లో దారుణం.. టీఆర్ఎస్ నేతను కొట్టి చంపిన ప్రత్యర్థులు

  • పొలానికి వెళ్తున్న నారాయణరెడ్డిపై దాడి
  • కర్రలు, రాళ్లతో దాడి చేసి హత్య
  • ఉద్రిక్తంగా గ్రామం.. పోలీసుల బందోబస్తు

వికారాబాద్ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ నేత నారాయణరెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. పరిగి మండలంలోని సుల్తాన్‌పూర్‌లో ఈ ఘటన జరిగింది.  పొలానికి వెళ్తున్న ఆయనను ప్రత్యర్థులు రాళ్లతో కొట్టి చంపారు. పాత కక్షలే హత్యకు కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

నారాయణరెడ్డి గతంలో నార్‌మ్యాక్స్ డైరెక్టర్‌గా ఉన్నారు. ఆ సమయంలో గ్రామంలోని కొందరు యువకులతో ఆయనకు గొడవలు జరిగాయి. మరోవైపు, నారాయణరెడ్డి అనుచరులు కొందరు ఇటీవల కాంగ్రెస్‌లో చేరారు. దీంతో ఇరు వర్గాల మధ్య గత కొంతకాలంగా పరిస్థితి వేడెక్కింది.

ఈ క్రమంలో నారాయణరెడ్డిని అంతం చేయాలని భావించిన ప్రత్యర్థులు ఉదయం పొలానికి వెళ్తున్న ఆయనపై రాళ్లు, కర్రలతో దాడిచేశారు. తీవ్రంగా గాయపడిన నారాయణరెడ్డి ఘటనా స్థలంలోనే మృతి చెందారు.  నారాయణరెడ్డి మృతితో గ్రామంలో పరిస్థితులు ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారాయి. కాంగ్రెస్ నేతల ఇళ్లపై ఆయన అనుచరులు దాడికి దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

More Telugu News