Amrutha: తన ఇంట్లో జరిగిన రెక్కీపై స్పందించిన అమృత!

  • హత్య చేసేందుకే నిఘా
  • ముఖానికి మాస్క్, నడుముకు తాడు
  • పోలీసులు వచ్చేలోపు పారిపోయారు
  • మీడియాతో అమృత వర్షిణి

తనను హత్య చేయాలని కొందరు నిఘా పెట్టారని పరువు హత్యకు గురైన ప్రణయ్ భార్య అమృత వర్షిణి మీడియా ముందు వ్యాఖ్యానించింది. తన ఇంట్లోకి ఓ గుర్తు తెలియని వ్యక్తి ప్రవేశించాడని, అది సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డయిందని పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆమె, ఆపై మాట్లాడుతూ, ఇద్దరు కానిస్టేబుళ్లు తమ ఇంటి పైగదిలో ఉంటూ గస్తీ నిర్వహిస్తున్నారని చెప్పిన ఆమె, వారు కిందకు వచ్చేలోపే ఆగంతుకుడు గోడ దూకి పారిపోయాడని వెల్లడించింది. ఇంట్లోకి వచ్చిన వ్యక్తి, ముఖద్వారానికి ఉన్న కర్టెన్ ను తొలగించి, లోపలికి చూశాడని చెప్పింది.

 ప్రణయ్ హత్య కేసులో నిందితులపై పీడీ చట్టం నమోదైన తరువాత ఈ ఘటన జరిగిందని, దీంతో తమకు చాలా భయంగా ఉందని చెప్పింది. ముఖానికి మాస్క్, నడుముకు నల్లని తాడు ధరించిన ఆ ఆగంతుకుడు చాలా బలంగా కనిపించాడని అమృత వెల్లడించింది. తనను చంపితే, అమృత తమ నుంచి దూరమవుతుందన్న ఆలోచనతో ఇటువంటి కుట్రలు చేస్తున్నారని ఇదే మీడియా సమావేశంలో పాల్గొన్న ప్రణయ్‌ తండ్రి బాలస్వామి ఆరోపించారు. సీసీటీవీ ఫుటేజ్ ని పోలీసులకు అందించామని, తమ ఇంట్లోకి వచ్చిన వ్యక్తిని గుర్తించి, శిక్షించాలని పోలీసులను కోరుతున్నామని అన్నారు.

More Telugu News