East Godavari District: 'ఇలాగైతే మాట్లాడటం కష్టం' అంటూ ప్రసంగాన్ని ఆపేసిన పవన్ కల్యాణ్!

  • తూర్పు గోదావరి జిల్లా పెద్దిపాలెంలో పవన్ సభ
  • సరైన ఏర్పాట్లు చేయని స్థానిక నేతలు
  • పని చేయని మైకులు, పవన్ అసహనం

తూర్పు గోదావరి జిల్లా పెద్దిపాలెంలో రైతులు, మహిళలు, అభిమానులను ఉద్దేశించి పవన్ కల్యాణ్ ప్రసంగిస్తున్న వేళ, ఊహించని పరిణామాలు జరగడంతో తన ప్రసంగాన్ని మధ్యలోనే ముగించారు పవన్. ఈ సభకు భారీ ఎత్తున ప్రజలు తరలిరాగా, సభ సజావుగా సాగేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయడంలో స్థానిక నాయకత్వం విఫలమైంది. పవన్ వేదికపైకి రాగానే, అభిమానులు, జనసేన కార్యకర్తల అరుపులు, కేకలతో సమావేశం గందరగోళమైంది. అభిమానులు సంయమనం పాటించాలని చేసిన విజ్ఞప్తులను ఎవరూ వినలేదు. ఇదే సమయంలో మైకులు మొరాయించాయి.

దీంతో పవన్ ఏం మాట్లాడుతున్నారో ఎవరికీ అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఒక దశలో తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేసిన పవన్, ఇటువంటి మైకులు ఉన్న చోట మాట్లాడటం కష్టం అంటూ తన ప్రసంగాన్ని ముగించడం గమనార్హం. అంతకుముందు ఆయన మాట్లాడుతూ, ఏలేరు కాలువ వెంబడి భూములను కలిగివున్న రైతులకు తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. మెట్టప్రాంతాల రైతుల కోసం కాలువ వెంబడి చెక్ డ్యాములను నిర్మిస్తామని తెలిపారు.

More Telugu News