Goa: నన్ను రేప్ చేస్తారట... బీజేపీపై కాంగ్రెస్ కార్యకర్త ఆరోపణలు!

  • సుభాష్ శిరోద్కర్ అనుచరులు ఫోన్ చేస్తున్నారు
  • నియోజకవర్గంలోకి వస్తే అత్యాచారం చేస్తారట
  • పోలీసులను ఆశ్రయించిన దియా షేట్కర్

బీజేపీ నేత సుభాష్ శిరోద్కర్ నుంచి తనకు బెదిరింపులు వస్తున్నాయని గోవా కాంగ్రెస్ మహిళా నేత దియా షేట్కర్ సంచలన ఆరోపణలు చేస్తూ, పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుభాష్ కు వ్యతిరేకంగా తాను ప్రచారం చేస్తున్నానని, వెంటనే తాను ఆగిపోకుంటే రేప్ చేస్తామని ఆయన అనుచరులు బెదిరింపులకు దిగుతున్నారని గోవా ప్రదేశ్ మహిళా కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న దియా, ఫిర్యాదు చేసింది.

ఫోన్ చేసిన సమయంలో చెప్పలేని భాషను వాళ్లు వాడుతున్నారని వాపోయింది. శిరోద్కర్ నియోజకవర్గంలో తాను ప్రవేశించరాదని వారు ఆదేశిస్తున్నారని తెలిపారు. ఓ మహిళను ఎదుర్కోలేక, వారు అత్యాచారం చేస్తామని బెదిరిస్తున్నారని ఆమె మీడియా ముందు చెప్పారు. తన ఫిర్యాదును పోలీసులు తీవ్రంగా పరిగణించాలని ఆమె డిమాండ్ చేశారు.

దియా ఫిర్యాదుతో గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేసిన పోలీసులు, విచారణ ప్రారంభించారు. కాగా, గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న శిరోద్కర్, ఆపై బీజేపీలో చేరారన్న సంగతి తెలిసిందే. తనపై దియా చేసిన ఆరోపణలపై ఆయన ఇంకా స్పందించలేదు.

More Telugu News