Bengalore: ఫేస్ బుక్ ప్రేమతో పెళ్లి... భర్త కోసం భార్య, కొడుకు కోసం తండ్రి పోలీసు కేసులు!

  • ప్రేమగా మారిన రెండేళ్ల పరిచయం
  • గర్భం దాల్చడంతో వదిలేసి వెళ్లిన యువకుడు
  • తమ బిడ్డ కనిపించడం లేదని తల్లిదండ్రుల ఫిర్యాదు
  • భర్త మోసం చేశాడంటున్న యువతి

ఫేస్ బుక్ లో పరిచయమైన యువకుడు, పెళ్లి చేసుకుని, రెండేళ్ల తరువాత తనను మోసం చేసి వెళ్లిపోయాడని ఓ యువతి, అత్తమామల ఇంటి ముందు దీక్షకు దిగగా, తన కుమారుడు కనిపించడం లేదంటూ సదరు యువకుడి తండ్రి పోలీసులను ఆశ్రయించాడు. మరిన్ని వివరాల్లోకి వెళితే, కర్ణాటక, మధుగిరి తాలూకా బుళసంద్రకు చెందిన సిద్ధిలింగప్పకు, రెండేళ్ల క్రితం చెన్నపట్టణకు చెందిన సరస్వతితో ఫేస్ బుక్ లో పరిచయం ఏర్పడింది.

తర్వాత వీరిద్దరి పరిచయం ప్రేమగా మారగా పెళ్లి చేసుకుని బెంగళూరులో కాపురం పెట్టారు. సరస్వతి గర్భం దాల్చడంతో, దాన్ని తొలగించాలని సిద్ధలింగప్ప చేసిన ప్రయత్నాలను సరస్వతి అడ్డుకుంది. దీంతో ఆమెను వదిలేసి వెళ్లిపోయాడు. నెల రోజులుగా భర్త జాడ తెలియని ఆమె, బుళసంద్రలోని అత్తమామల ఇంటికి వచ్చి, బంధువులతో కలసి ధర్నాకు దిగింది.

మరోపక్క, తమ కుమారుడి జాడ తెలియదని అతని తల్లిదండ్రులు అంటున్నారు. ఇదే విషయమై బెంగళూరు అక్కూరు పోలీసులకు సిద్ధలింగప్ప తండ్రి దొడ్డయ్య ఫిర్యాదు చేయగా, తన భర్త మోసం చేశాడంటూ సరస్వతి బసవనహళ్లి పోలీసులను ఆశ్రయించింది.

More Telugu News