Telangana: శేరిలింగంపల్లి టికెట్ లొల్లి.. ఆత్మహత్యకు యత్నించిన కాంగ్రెస్ నేత భిక్షపతి అనుచరుడు!

  • కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు యత్నం
  • అడ్డుకున్న పోలీసులు, కాంగ్రెస్ కార్యకర్తలు
  • సీటును టీడీపీకి ఇవ్వొద్దని హైకమాండ్ కు వినతి

శేరిలింగంపల్లి నియోజకవర్గం టికెట్ ను తనకే కేటాయించాలని మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్ ఈ రోజు గాంధీభవన్ ముందు ఆందోళనకు దిగారు. బీసీ సామాజికవర్గానికి చెందిన తాను త్యాగం చేయాలని చెప్పడం ఎంతవరకూ న్యాయమని ప్రశ్నించారు. శేరిలింగంపల్లి విషయంలో కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి వెంటనే నిర్ణయం తీసుకోవాలని కోరారు. కాగా, ఈ సందర్భంగా భిక్షపతి యాదవ్ అనుచరుడు ఒకరు ఆత్మహత్యకు యత్నించడంతో కలకలం చెలరేగింది.

తన వెంట కిరోసిన్ తెచ్చుకున్న భిక్షపతి అనుచరుడు ఒకరు శరీరంపై పోసుకుని మంట అంటించుకునేందుకు యత్నించాడు. అయితే వెంటనే అప్రమత్తమైన పోలీసులు, కాంగ్రెస్ కార్యకర్తలు అతడిని అడ్డుకున్నారు. కాగా, కార్యకర్తలు ఎవరూ తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని ఈ సందర్భంగా భిక్షపతి యాదవ్ కోరారు. కాంగ్రెస్ అధిష్ఠానం శేరిలింగంపల్లి టికెట్ ను టీడీపీకి ఇవ్వొద్దని, అలా చేస్తే టీఆర్ఎస్ అభ్యర్థి అక్కడ సులభంగా గెలుపొందుతారని అన్నారు. 

More Telugu News