Bhadradri Kothagudem District: వయసులో పెద్ద అయిన యువతిని ప్రేమించిన ఖమ్మం విద్యార్థి... తిరస్కరించడంతో ఆత్మహత్య!

  • భద్రాద్రి జిల్లా ఖమ్మంలో ఘటన
  • ఇంటర్ చదువుతున్న నవీన్
  • పెద్దమ్మాయితో పెళ్లేంటని మందలించిన తల్లిదండ్రులు
  • కాలేజీ మైదానంలోనే ఉరేసుకుని ఆత్మహత్య

వయసులో తనకన్నా పెద్దదైన అమ్మాయిని ప్రేమించిన ఓ యువకుడు, తల్లిదండ్రులు మందలించారని, ఆమె తిరస్కరించిందన్న మనస్తాపంతో యువతితో మాట్లాడి, ఆపై నిమిషాల వ్యవధిలోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన భద్రాద్రి జిల్లా పాల్వంచ మండలం లక్ష్మీదేవిపల్లిలో తీవ్ర కలకలం రేపింది.

పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల్లోకి వెళితే, లక్ష్మీదేవిపల్లి గ్రామానికి చెందిన కాలం నాగయ్య కుమారుడు, నవీన్‌ (18) ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ చదువుతున్నాడు. పాల్వంచలోని గవర్నమెంట్‌ హాస్టల్‌ లో ఉండే నవీన్ కు తన గ్రామంలోని ఓ యువతితో పరిచయం ఉంది. ఆ అమ్మాయిని నవీన్ ప్రేమించాడు. ఈ విషయం అతడి తల్లిదండ్రులకు తెలియడంతో మందలించారు. వయస్సులో అమ్మాయి పెద్దదని గుర్తు చేస్తూ, పెళ్లి చేసేది లేదని చెప్పారు.

ఈ నేపథ్యంలో హాస్టల్ నుంచి ఆమెతో ఫోన్ లో మాట్లాడిన నవీన్, ఆమె కూడా ప్రేమ వద్దని తిరస్కరించడంతో మనస్తాపానికి గురయ్యాడు. నిన్న రాత్రి, హాస్టల్‌ పక్కనే ఉన్న డిగ్రీకళాశాల మైదానంలోని ఓ చెట్టుకు ఉరేసుకున్నాడు. తెల్లవారు జామున వ్యాయామం నిమిత్తం వచ్చిన ఇతర విద్యార్థులు నవీన్ మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పాల్వంచ ఏరియా ఆసుపత్రికి తరలించారు. తండ్రి నాగయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

More Telugu News