Odisha: మరో ఇద్దరు ఎమ్మెల్యేలను చంపేస్తాం: మావోయిస్టులు!

  • కలకలం రేపుతున్న పోస్టర్లు
  • ఎమ్మెల్యేల పేర్లు వెలువరించని పోలీసులు
  • భద్రత పెంచుతున్నామని వెల్లడి

అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమల హత్యలను మరువకముందే మావోయిస్టులు మరో ఇద్దరు ఎమ్మెల్యేలను హత్య చేయనున్నామని ప్రకటించడం తీవ్ర కలకలం రేపుతోంది. బెర్హంపూర్ జిల్లాలో ఇద్దరు ఎమ్మెల్యేలను చంపేస్తామంటూ మావోయిస్టులు బ్యానర్లు కట్టగా, వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

గంజాం జిల్లా దర్పంగ ఏరియాలో ఇవి లభించాయని చెప్పిన ఎస్పీ బ్రిజేశ్ కుమార్, సదరు ఎమ్మెల్యేల పేర్లను మాత్రం వెల్లడించలేదు. వీరిద్దరూ గంజాం, కొంధమాల్ జిల్లాలకు చెందిన వారిగా తెలుస్తోంది. ఇక ఈ ప్రాంతంలోని ఎమ్మెల్యేలకు బందోబస్తును మరింతగా పెంచామని పోలీసు అధికారులు తెలిపారు. మావోయిస్టుల పోస్టర్ పై ఏ శాఖ, ఏ డివిజన్ అన్న వివరాలు లేకపోగా, ఇది మావోల పేరిట సంఘ విద్రోహ శక్తులు తయారు చేసి వుండవచ్చన్న కోణంలోనూ విచారిస్తున్నట్టు పోలీసు అధికారులు వెల్లడించారు.

More Telugu News