Andhra Pradesh: నెల్లూరులో టెర్రర్.. వ్యాపారిని తుపాకీతో కాల్చిచంపిన దుండగులు!

  • జిల్లాలోని ఫతేఖాన్ పేటలో ఘటన
  • మార్బుల్స్ వ్యాపారం చేస్తున్న మహేంద్ర సింగ్
  • ముసుగులతో వచ్చి కాల్పులు

నెల్లూరు జిల్లాలో దుండగులు రెచ్చిపోయారు. ఓ వ్యాపారి లక్ష్యంగా కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ వ్యాపారి ప్రాణాలు కోల్పోగా, నిందితులు ఘటనాస్థలం నుంచి పరారయ్యారు. ఈ ఘటన ఫతేఖాన్ పేటలో చోటుచేసుకుంది.

రాజస్తాన్ నుంచి నెల్లూరుకు వలస వచ్చిన మహేంద్ర సింగ్ మార్బుల్స్ వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఇటీవల ఫతేఖాన్ పేటలో సొంత దుకాణాన్ని తెరిచాడు. ఇదే క్రమంలో నిన్న రాత్రి షాపును మూసివేసి ఇంటికివెళ్లే సమయంలో బైక్ పై ముసుగు ధరించి వచ్చిన కొందరు దుండగులు సింగ్ పై కాల్పులు జరిపి పరారయ్యారు.

దీంతో రక్తపు మడుగులో పడున్న సింగ్ ను స్థానికులు ఆసుపత్రికి తరలించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మహేంద్ర సింగ్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై కేసు నమోదుచేసుకున్న అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

ఈ విషయమై జిల్లా పోలీస్ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ.. దాడికి సంబంధించి సమీపంలో ఉన్న సీసీటీవీ ఫుటేజీలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. నిందితులను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను రంగంలోకి దించినట్లు చెప్పారు. 

More Telugu News