Uttar Pradesh: ఐసీయూలో చికిత్స పొందుతున్న బాలికపై స్నేహితులతో కలిసి ఉద్యోగి గ్యాంగ్ రేప్!

  • ఉత్తరప్రదేశ్ లోని బరేలీలో ఘటన
  • పాముకాటుకు గురైన చిన్నారి
  • బరేలీలోని ప్రైవేటు ఆసుపత్రిలో ఘటన

ప్రాణాపాయంతో ఆసుపత్రిలో చేరిన చిన్నారి బాలికను కామాంధులు చిదిమేశారు. ఐసీయూలో చికిత్స పొందుతుందన్న కనికరం కూడా లేకుండా ఆమెపై గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. చివరికి బాధితురాలు ఈ విషయాన్ని తల్లికి వివరించడంతో దారుణం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని బరేలీ జిల్లాలో చోటుచేసుకుంది.

జిల్లాలోని ఓ గ్రామంలో బాలిక(8) పాముకాటుకు గురైంది. దీంతో తల్లిదండ్రులు ఆమెను జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో ఐసీయూలో ఉంచారు. ఈ నేపథ్యంలో ఆసుపత్రిలో పనిచేస్తున్న ఓ వ్యక్తి, మరో నలుగురు స్నేహితులతో కలిసి బాలికపై గ్యాంగ్ రేప్ చేశాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించి వెళ్లిపోయారు.

మరుసటి రోజు బాలికను వైద్యులు జనరల్ వార్డుకు తరలించారు. ఈ సందర్భంగా తనపై జరిగిన దారుణాన్ని బాధితురాలు తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఐదుగురు నిందితులపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నారనీ, వారిని త్వరలోనే పట్టుకుంటామని పోలీస్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

More Telugu News