Ambati Rayudu: అంబటి రాయుడు అనూహ్య నిర్ణయం.. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌కు గుడ్‌బై

  • పరిమిత ఓవర్ల క్రికెట్‌పైనే దృష్టి
  • వన్డే ప్రపంచకప్‌లో ఆడడమే లక్ష్యంగా నిర్ణయం
  • తనకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు

టీమిండియా ఆటగాడు అంబటి రాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నాడు. విండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో రాణించి జట్టులో తన స్థానాన్ని పదిలం చేసుకున్న రాయుడు.. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌కు గుడ్ బై చెప్పేశాడు. ఈ మేరకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) నిర్ధారించింది. ఇకపై పరిమిత ఓవర్ల క్రికెట్‌పైనే దృష్టి సారించాలని నిర్ణయించిన రాయుడు ఈ నిర్ణయం తీసుకున్నాడు. అంటే, ఇకపై రంజీ ట్రోఫీలు సహా నాలుగు రోజుల మ్యాచుల్లో ఆడడు. దేశవాళీ, అంతర్జాతీయ మ్యాచుల్లో వన్డేలు మాత్రమే ఆడనున్నాడు.

ఇప్పటి వరకు టీమిండియా తరపున ఒక్క టెస్టూ ఆడని రాయుడు, ఇకపైనా టెస్టు జట్టుకు ఎంపికయ్యే అవకాశం లేకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. వచ్చే ఏడాది జరగనున్న వన్డే ప్రపంచకప్, ఆ తర్వాత జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో ఆడడమే లక్ష్యంగా పెట్టుకున్న రాయుడు టెస్టుల నుంచి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు చెబుతున్నారు. కాగా, ఇప్పటి వరకు తన అండగా ఉన్న హెచ్‌సీఏ, సహచర ఆటగాళ్లకు రాయుడు కృతజ్ఞతలు తెలిపాడు.

More Telugu News