India: రఘురామ్ రాజన్ లాగే ఉర్జిత్ పటేల్ నూ సాగనంపుతారు!: కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి చిదంబరం

  • స్వదేశీ జాగరణ్ మంచ్ ఇదే చెప్పింది
  • బీజేపీ సైతం దీన్నే కోరుకుంటోంది
  • సామాజిక, ఆర్థిక అస్థిరత్వం తలెత్తుతుంది

భారత రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) అధికారాలకు కత్తెర వేసేందుకు కేంద్రం యత్నిస్తున్నట్లు ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ పదవీ బాధ్యతల నుంచి తప్పుకునే అవకాశం ఉందని ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థికశాఖ మాజీ మంత్రి పి.చిదంబరం స్పందించారు. గతంలో ఆర్బీఐ గవర్నర్ గా ఉన్న రఘురామ్ రాజన్ ను రెండోసారి బాధ్యతలు చేపట్టకుండా కేంద్రం సాగనంపిందని గుర్తుచేశారు. ప్రస్తుత ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ విషయంలోనూ అదే ఘటన పునరావృతం అవుతోందని విమర్శించారు.

‘ఉర్జిత్‌ పటేల్‌ను ఆర్బీఐ గవర్నర్ బాధ్యతల నుంచి తప్పించాలని బీజేపీ అనుబంధ సంస్థ స్వదేశీ జాగరణ్ మంచ్‌ కోరుకుంటోంది. దానర్థం మోదీ ప్రభుత్వం కూడా ఆయన వెళ్లిపోవాలనే భావిస్తోంది. రఘురామ్ రాజన్‌ కథే పునరావృతం అవుతోంది. అమెరికా ఫెడరల్ రిజర్వ్‌ బ్యాంకు మాజీ ఛైర్మన్‌ జానెత్‌ యెల్లెన్‌ ఇటీవల ఓ మాట చెప్పారు. ‘‘ప్రజలు ఎంతో నమ్మకం ఉంచిన సంస్థల చట్టబద్ధత, స్థాయిని దూరం చేయడం అంతిమంగా సామాజిక, ఆర్థిక అస్థిరత్వానికి దారితీస్తుంది’ అని ఆమె హెచ్చరించారు. భారత్‌లో ఇది నిజం అనిపిస్తోంది’’ అని చిదంబరం ట్వీట్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయాలనీ, లేదంటే రాజీనామా చేయాలని ఆర్బీఐ గవర్నర్ కు స్వదేశీ జాగ‌రణ్ మంచ్‌ ఇటీవల సూచించిన సంగతి తెలిసిందే.

More Telugu News