MP sivaprasad: ఇదేం తీరు... ప్రోటోకాల్‌ కూడా పాటించరా?: ఎంపీ శివప్రసాద్‌ ఫైర్‌

  • నా నియోజక వర్గంలో కేంద్రమంత్రి పర్యటిస్తే సమాచారం ఇవ్వరా
  • ఎంపీనే కాదు 14 కమిటీలకు అధ్యక్షుడిని
  • ఆవేదన వ్యక్తం చేసిన పార్లమెంటు సభ్యుడు

‘నా నియోజకవర్గంలో కేంద్రమంత్రి పర్యటిస్తే కనీసం సమాచారం ఇవ్వాలన్న ఆలోచన చేయరా, ప్రోటోకాల్‌ పాటించరా, ఇదేం విధానం’ అంటూ చిత్తూరు ఎంపీ, నిత్యం వివిధ వేషధారణలతో వార్తల్లో ఉండే సినీ నటుడు డాక్టర్‌ ఎన్‌.శివప్రసాద్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి జయంత్‌సిన్హా శుక్రవారం తిరుపతిలోని ఆర్‌ఆర్‌ గార్డెన్స్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంపై తనకు సమాచారం లేదని ఎంపీ తెలిపారు.

‘నేను కేవలం పార్లమెంటు సభ్యుడినే కాదు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన 14 కమిటీలకు అధ్యక్షుడిగా కూడా ఉన్నాను. అటువంటి నా పట్ల ప్రోటోకాల్‌ పాటించే విధానం ఇదేనా?’ అని ఎంపీ ప్రశ్నించారు. ఈ కార్యక్రమమే కాదు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో నిత్యం అనేక కార్యక్రమాలు జరుగుతున్నా తనకు సమాచారం ఇవ్వడం లేదని చెప్పారు. మున్సిపాలిటీల్లో తాగునీటి సరఫరాకు చేపడుతున్న అమృత పథకానికి చైర్మన్‌నని, ఈ పథకం సమీక్షా సమావేశాలకు కూడా తనను పిలవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

More Telugu News