lakshiparvathi: టీడీపీని సొంత ప్రయోజనాల కోసం బాబు తాకట్టుపెట్టారు : లక్ష్మీపార్వతి

  • ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద నిరసన తెలిపిన ఆయన సతీమణి
  • చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్‌కు పొడిచిన రెండో వెన్నుపోటు ఇది
  • పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఆత్మ క్షోభిస్తుంది

కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పుట్టిన తెలుగుదేశం పార్టీని, ఎన్టీఆర్‌ ఆశయాలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన సొంత ప్రయోజనాల కోసం తాకట్టు పెట్టారని ఎన్టీఆర్‌ భార్య లక్ష్మీపార్వతి విమర్శించారు. పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌కు చంద్రబాబు పొడిచిన రెండో వెన్నుపోటు ఇదన్నారు. ఆ మహానుభావుడి ఆత్మ క్షోభిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.

హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ సమాధివద్ద నివాళులర్పించిన అనంతరం ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద ఆమె నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జరుగుతున్న పరిణామాలతో తాను తీవ్రంగా ఆవేదన చెందానన్నారు. నాలుగేళ్లపాటు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో అంటకాగి, ఎన్నికల ముందు ప్రజల్ని మోసం చేసేందుకు చంద్రబాబు తాజా విన్యాసాలు ప్రారంభించారని విమర్శించారు.

తన అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్‌ పెద్దల ముందు మోకరిల్లారని విమర్శించారు. ఎన్టీఆర్‌ పేరు ప్రస్తావించే హక్కు చంద్రబాబుకు లేదని, ఇందుకోసం న్యాయపోరాటం చేసే అవకాశాలుంటే పరిశీలిస్తానన్నారు. ఈ సందర్భంగా తన మనసులోని మాటతో ఓ లేఖ రాసిన లక్ష్మీపార్వతి దానిని ఎన్టీఆర్‌ సమాధి దగ్గర ఉంచారు.

More Telugu News