Andhra Pradesh: ప్రత్యేకహోదా కింద ఏపీకి ఆర్థిక సాయం చేస్తే ఓకే.. రాయితీలు ఇస్తే తెలంగాణకు ఇబ్బంది!: టీఆర్ఎస్ నేత వినోద్

  • రాయితీ ఇస్తారా, సాయం చేస్తారా?
  • ఈ విషయాన్ని బాబు, రాహుల్ తేల్చాలి
  • ఆంధ్రులను మరోసారి మోసం చేసేందుకు కుట్ర

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా విషయమై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పష్టత ఇవ్వాలని టీఆర్ఎస్ నేత, పార్లమెంటు సభ్యుడు బి.వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. ఏపీకి హోదా కింద ఆర్థిక సాయం చేస్తారా? లేక పారిశ్రామిక రాయితీలు అందజేస్తారా? అన్నది తేల్చాలన్నారు. హోదా పేరుతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను మోసం చేయొద్దని ఏపీ సీఎం చంద్రబాబు, రాహుల్ గాంధీలను వినోద్ హెచ్చరించారు.

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా ఇవ్వవద్దని 2016లో అప్పటి తమిళనాడు సీఎం జయలలిత, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కేంద్రానికి లేఖ రాశారని వినోద్ గుర్తుచేశారు. ఏపీకి ఆర్థిక సాయం చేస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని తేల్చిచెప్పారు. ఏపీ ప్రజలను మరోసారి మోసం చేసేందుకు చంద్రబాబు, రాహుల్ కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. ఒకవేళ ఏపీకి పన్ను రాయితీలు ఇస్తే తెలంగాణలో పరిస్థితి ఇబ్బందికరంగా మారుతుందని వ్యాఖ్యానించారు.

More Telugu News