Andhra Pradesh: ప్రేమ పేరుతో సైకో టీచర్ వేధింపులు.. కత్తితో యువతి గొంతు కోసిన ప్రబుద్ధుడు!

  • కర్నూలు జిల్లా బంగారుపేటలో ఘటన
  • ప్రేమ పేరుతో వేధించిన టీచర్ శంకర్
  • ఒప్పుకోకపోవడంతో హత్యాయత్నం

విద్యాబుద్ధులు నేర్పించాల్సిన టీచర్ దారితప్పాడు. తనను ప్రేమించాలని బాలికను వేధించడం మొదలుపెట్టాడు. అయితే సదరు యువతి అందుకు అంగీకరించకపోవడంతో రెచ్చిపోయిన టీచర్ ఈ రోజు బాధితురాలి గొంతును కోసేశాడు. అనంతరం తానూ ప్రాణాలు తీసుకునేందుకు యత్నించాడు. ఈ ఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది.

కర్నూలు పట్టణంలోని బంగారుపేట కాలనీలో బాధితురాలు ఉంటోంది. అక్కడే స్థానికంగా ఉన్న పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. ఈ నేపథ్యంలో అక్కడే హిందీ టీచర్ గా పనిచేస్తున్న శంకర్ బాలికపై కన్నేశాడు. తనను ప్రేమించాలని వేధించడం మొదలుపెట్టాడు. అయితే ఇందుకు అంగీకరించని బాలిక విషయాన్ని తల్లికి చెప్పింది. దీంతో తల్లి, ఇతర కుటుంబ సభ్యులు శంకర్ ను హెచ్చరించారు. అయినా ప్రవర్తన మార్చుకోని ఆ ప్రబుద్ధుడు యువతి వెంటపడటం కొనసాగించాడు.

ఈ నేపథ్యంలో పూటుగా మద్యం సేవించిన శంకర్ ఈ రోజు బంగారుపేట కాలనీలో ఉంటున్న యువతి ఇంట్లోకి వెళ్లాడు. అక్కడే ఉన్న ఆమె గొంతును కోసేశాడు. అనంతరం తానూ గొంతు కోసుకుని ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించాడు. ఈ సందర్భంగా బాలిక అరుపులు విన్న స్థానికులు అక్కడకు చేరుకుని శంకర్ ను చితకబాదారు. బాధితురాలిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించి, శంకర్ ను చెట్టుకు కట్టేశారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. కాగా ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ బాధితురాలి ఆరోగ్యం ప్రస్తుతం స్థిరంగా ఉందని వైద్యులు తెలిపారు.

More Telugu News