Andhra Pradesh: కాంగ్రెస్-టీడీపీ పొత్తు.. పార్టీకి సీనియర్ నేత సి.రామచంద్రయ్య రాజీనామా!

  • అధిష్ఠానం నిర్ణయం నేపథ్యంలో మనస్తాపం
  • టీడీపీతో పొత్తు పెట్టుకోవడంతో బయటకు
  • మరికాసేపట్లో మీడియా సమావేశం

తెలుగుదేశం పార్టీతో టీడీపీ జతకట్టడంపై ఆగ్రహంగా ఉన్న కాంగ్రెస్ సీనియర్ కాపులు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. ఈ పొత్తుపై ఆగ్రహంతో ఇప్పటికే వట్టి వసంతకుమార్ పార్టీ నుంచి బయటకు వెళ్లిపోగా, తాజాగా సీనియర్ నేత సి.రామచంద్రయ్య కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై మరికాసేపట్లో రామచంద్రయ్య మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.

ఆంధ్రప్రదేశ్ లో పార్టీకి పూర్వవైభవం తీసుకొస్తామనీ, ఇందుకోసం టీడీపీతో జట్టుకట్టాల్సిన పనిలేదని వట్టి వసంతకుమార్, రామచంద్రయ్య సహా పలువురు నేతలు హైకమాండ్ కు తెలిపారు. తమ మాటను వినకుండా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవడంపై మనస్తాపం చెందిన రామచంద్రయ్య మరికాసేపట్లో రాజీనామా చేసేందుకు గల కారణాలపై మీడియాతో మాట్లాడుతారని సమాచారం.

మరోవైపు, నేతలెవరూ తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దని ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి కోరారు. కాగా, కాంగ్రెస్ పార్టీ నుంచి వైదొలిగిన తర్వాత రామచంద్రయ్య వైసీపీలో చేరతారని జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే గతంలో మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యంలో రామచంద్రయ్య పనిచేశారు. ఈ నేపథ్యంలో ఆయన జనసేన పార్టీలోకి వెళ్లే అవకాశం కూడా ఉందని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.

More Telugu News