Maulana Samiul Haq: తాలిబన్ల పితామహుడు మౌలానా దారుణ హత్య.. ఇంట్లోనే గొంతు కోసి చంపిన దుండగుడు!

  • ‘ఫాదర్ ఆఫ్ ది తాలిబన్’గా గుర్తింపు పొందిన మౌలానా
  • పాక్ పార్లమెంటుకు రెండుసార్లు ఎంపికైన మౌలానా
  • హత్యపై భిన్న కథనాలు

తాలిబన్ల పితామహుడు మౌలానా సామియుల్ హక్ (82) దారుణ హత్యకు గురయ్యాడు. పాకిస్థాన్‌లోని రావల్పిండిలో ఆయన నివాసంలో శుక్రవారం ఓ దుండగుడు అతడిని గొంతు కోసి చంపేశాడు. ఆ సమయంలో మౌలానా అంగరక్షకుడు మార్కెట్‌కు వెళ్లాడు. అతడు తిరిగి వచ్చేసరికి తన తండ్రి రక్తపు మడుగులో పడి ఉన్నాడని మౌలానా కుమారుడు హమిదుల్ హక్ తెలిపాడు.

ఇస్లామి జమ్హూరీ ఇత్లెహాద్ తరపున పాకిస్థాన్ పార్లమెంటుకు రెండుసార్లు ఎన్నికైన మౌలానా ‘ఫాదర్ ఆఫ్ ది తాలిబన్’గా గుర్తింపు పొందాడు. మత బోధకుడిగానూ పనిచేశాడు. దాదాపు 40 సంస్థలకు అధ్యక్షుడిగా ఉన్నాడు. మౌలానా హత్యపై పాక్ మంత్రి షెరియార్ అఫ్రిది తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాగా, మౌలానాను కొందరు దుండగులు కాల్చి చంపారని తొలుత వార్తలు వచ్చాయి. అయితే, ఓ దుండగుడు అతడిని గొంతు కోసి హత్య చేశాడని ఆయన కుమారుడు తెలిపాడు.

More Telugu News