Hyderabad: హైదరాబాద్ ను బంగారుమయం చేసి అందించా.. పాలించుకోలేని కేసీఆర్ నాపై విమర్శలా?: సీఎం చంద్రబాబు

  • ప్రపంచమంతా తిరిగి హైదరాబాద్ ను అభివృద్ధి చేశా
  • అమరావతిని కూడా అభివృద్ధి చేస్తా
  • కోడికత్తి డ్రామాతో ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు విమర్శలు గుప్పించారు. ప్రకాశం జిల్లా మార్టూరు మండలంలోని డేగరమూడిలో నిర్వహించిన బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ, హైదరాబాద్ ను బంగారుమయం చేసి అందిస్తే, కేసీఆర్ పాలించుకోలేకపోతున్నారని, పైగా తనపై విమర్శలు చేస్తున్నారని అన్నారు. ప్రపంచమంతా కాళ్లరిగేలా తిరిగి హైదరాబాద్ ను అభివృద్ధి చేశానని గుర్తుచేసుకున్నారు.

హైదరాబాద్ ను అభివృద్ధి చేసినట్టే అమరావతిని కూడా అభివృద్ధి చేస్తానని, ఏపీని భారత్ లో నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దే వరకు నిద్రపోనని భావోద్వేగంతో చంద్రబాబు చెప్పారు. ఈ సందర్భంగా వైసీపీ అధినేత జగన్, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పైనా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కోడికత్తి డ్రామాతో ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని వైసీపీ చూస్తోందని అన్నారు. ఏపీ విభజన హామీల అమలుపై నిజనిర్ధారణ కమిటీ వేశామని చెప్పిన పవన్, ఆ కమిటీని గాలికొదిలేశారని ముఖ్యమంత్రి మండిపడ్డారు.

More Telugu News