mj akbar: నా భర్తపై పల్లవి ఆరోపణలు అవాస్తవం: ఎంజే అక్బర్ భార్య మల్లిక

  • కొన్నేళ్ల కిందట పల్లవి మా కుటుంబంలో చిచ్చుపెట్టింది
  • నా భర్తకు అర్ధరాత్రి సమయంలో ఫోన్ కాల్స్ చేసేది
  • ఓ పార్టీలో నా భర్త, ఆమె కలిసి డ్యాన్స్ చేశారు

కేంద్ర మాజీ మంత్రి ఎంజే అక్బర్ గతంలో తనపై అత్యాచారం చేశారని ఎన్ఆర్ఐ మహిళ పల్లవి గొగొయ్ ఆరోపణలు చేసింది. ఈ ఆరోపణలను ఖండించిన అక్బర్, పరస్పర అంగీకారంతో తమ మధ్య సంబంధం కొన్ని నెలలు కొనసాగిందని వివరణ ఇవ్వడం తెలిసిందే. ఈ ఆరోపణలపై అక్బర్ భార్య మల్లికా అక్బర్ కూడా స్పందించారు.

తన భర్తపై ‘మీటూ’ ఆరోపణలు వస్తున్నా ఇన్నాళ్లూ మౌనంగా ఉన్నానని, కానీ, పల్లవి చేసిన ఆరోపణల నేపథ్యంలో తాను పెదవి విప్పక తప్పడం లేదని అన్నారు. కొన్నేళ్ల కిందట పల్లవి తమ కుటుంబంలో చిచ్చుపెట్టిందని చెప్పారు. తన భర్తకు అర్ధరాత్రి సమయంలో ఫోన్ కాల్స్ చేయడం, పబ్లిక్ గా వీళ్లిద్దరూ సన్నిహితంగా ఉండటంతో వాళ్లిద్దరి మధ్య సంబంధం తనకు తెలిసిందని అన్నారు.

తమ ఇంట్లో జరిగిన ఓ పార్టీలో తన భర్త, ఆమె కలిసి డ్యాన్స్ చేయడం తనను బాధించిందని, ఈ విషయమై నాడు తన భర్తను నిలదీసిన విషయాన్ని ఆమె గుర్తుచేసుకున్నారు. ఇకపై కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తానని తన భర్త అప్పుడు చెప్పారని అన్నారు. పల్లవి గొగొయ్, తుషితా పటేల్ ఇద్దరూ తమ నివాసానికి తరచుగా వస్తుండేవారని మల్లికా అక్బర్ చెప్పుకొచ్చారు.

More Telugu News