Chandrababu: నాడు ఎన్టీఆర్ చేసిన పనే నేడు నేనూ చేశాను: చంద్రబాబు

  • ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలన్నదే ఎన్టీఆర్ ఆశయం
  • ఇప్పుడు నేను అదే ఆశయం కోసం పనిచేస్తున్నా
  • అందరూ కలవాల్సిన సమయం వచ్చిందన్న చంద్రబాబు

1982లో తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడాలన్న ఉద్దేశంతో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారని, నేడు అదే ఆత్మగౌరవానికి కలుగుతున్న అవమానాలకు వ్యతిరేకంగా తాను పోరాడుతున్నానని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. ఈ ఉదయం అమరావతిలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన, దేశానికి ఎప్పుడు ప్రమాదం వాటిల్లినా, టీడీపీ క్రియాశీలక పాత్రను పోషించి, కష్టాల నుంచి కాపాడిందని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు అందరూ కలవాల్సిన సమయం వచ్చింది కాబట్టే, జాతీయ స్థాయిలో పార్టీలను కలపాలని నిర్ణయించుకున్నానని చంద్రబాబు తెలిపారు.

ప్రజాస్వామ్యానికి మూల స్తంభాలైన వ్యవస్థలను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వ్యాఖ్యానించిన ఆయన, నిరంకుశత్వాన్ని ఎదిరించే గుణం తనకు ఎన్టీఆర్ నుంచే వచ్చిందని తెలిపారు. కలసి వచ్చే రాజకీయ పార్టీలను ఏకం చేసే ఆలోచనలో ఉన్నానని అన్నారు. ఆత్మాభిమానాన్ని నిలబెట్టుకోవడం ఎన్టీఆర్ నిర్దేశించిందేనని చెప్పారు. గోద్రా అల్లర్ల తరువాత అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీని రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది తెలుగుదేశం పార్టీయేనని చంద్రబాబు గుర్తు చేశారు.

More Telugu News