DD cameraman: డీడీ కెమరామన్‌ను పొరపాటున చంపేశాం.. అది మీడియాపై దాడి కాదు: మావోయిస్టులు

  • నక్సల్స్ దాడిలో మృతి చెందిన డీడీ కెమెరామన్
  • పొరపాటు జరిగిందన్న మావోయిస్టులు
  • కానే కాదన్న దంతెవాడ ఎస్పీ

దంతెవాడ దాడిపై మావోయిస్టులు స్పందించారు. మీడియా ఎప్పటికీ తమ లక్ష్యం కాదంటూ చేతి రాతతో కూడిన ఓ లేఖను విడుదల చేశారు. దంతెవాడ దాడిలో ఇద్దరు పోలీసులు సహా డీడీ కెమెరామన్ అచ్యుతానంద సాహు మృతి చెందారు. ఆకస్మిక దాడిలో అచ్యుతానంద మృతి చెందారు తప్పితే అతడిని చంపాలన్నది తమ ఉద్దేశం కాదని లేఖలో పేర్కొన్నారు.

మావోయిస్టు లేఖపై దంతెవాడ ఎస్పీ అభిషేక్ పల్లవ్ స్పందించారు. మావోయిస్టులు చెబుతున్న దాంట్లో నిజం లేదన్నారు. మీడియాను లక్ష్యంగా చేసుకునే ఆయనను హతమార్చినట్టు చెప్పారు. ఇప్పుడేమో పొరపాటు జరిగిందని చెబుతున్నారని అన్నారు. మొదట కొన్ని నిమిషాలు ఏం జరిగిందో చెప్పాలనే ఉద్దేశంతోనే కెమెరామన్ అక్కడి దృశ్యాలను చిత్రీకరించేందుకు వెళ్లినట్టు తెలిపారు. నక్సల్స్ దాడిలో అచ్యుత్ శరీరంలోకి బోలెడన్ని తూటాలు దూసుకెళ్లాయని పేర్కొన్నారు. ఇది ముమ్మాటికీ తప్పిదం కాదని పల్లవ్ తేల్చి చెప్పారు. అచ్యుత్‌ను చంపిన అనంతరం నక్సల్స్ అతడి కెమెరాను ఎత్తుకెళ్లారు.

More Telugu News