saidabad: యాసిడ్‌ పోస్తానంటూ యువతికి బెదిరింపు!

  • కొన్నాళ్లుగా ఇద్దరూ ప్రేమ ప్రయాణం
  • పెళ్లికి నిరాకరించిన యువతి తల్లిదండ్రులు
  • దీంతో గుడిలో పెళ్లికి ఒత్తిడి చేసిన యువకుడు

ప్రేమించిన యువతితో పెళ్లికి ఆమె తల్లిదండ్రులు అడ్డుపడుతుండడంతో బలవంతంగానైనా ఆమెను సొంతం చేసుకోవాలనుకున్న ఓ యువకుడి ప్రయత్నం బెడిసికొట్టింది. యాసిడ్‌ పోస్తానని బెదిరించి ఆమెను కొంతదూరం వరకు తీసుకువెళ్లగలిగిన యువకుడు అనంతరం యువతి కేకలు వేయడంతో భయపడి పరుగందుకున్నాడు.

పోలీసుల కథనం మేరకు వివరాలిలావున్నాయి. హైదరాబాద్ లోని సైదాబాద్‌లో నివసించే నిఖిల్‌ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నాడు. సైదాబాద్‌ సమీపంలో నివసించే ఓ యువతి (21) బంజారాహిల్స్‌ రోడ్డు నంబరు 12లో ఉన్న సంస్థలో పనిచేస్తోంది. మూడేళ్లుగా వీరిద్దరి మధ్య పరిచయం ఉంది. పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో పెళ్లి చేసుకోవాలనుకున్నారు. దీనికి యువతి తల్లిదండ్రులు అంగీకరించలేదు. తమ కుమార్తె జోలికి రావద్దంటూ నిఖిల్‌ను వారు హెచ్చరించారు. దీంతో యువతి కూడా నిఖిల్‌ను దూరం పెట్టింది.

ఈ నేపథ్యంలో బలవంతంగానైనా ఆ యువతిని పెళ్లి చేసుకోవాలనుకున్న నిఖిల్‌ గురువారం ఆమె పనిచేస్తున్న కార్యాలయం వద్దకు వచ్చాడు. మాట్లాడాల్సి ఉందని రమ్మని చెప్పాడు. రాగానే యాసిడ్‌ సీసా చూపించాడు. తన వెంట రాకుంటే యాసిడ్‌ పోస్తానని బెదిరించాడు. ఆమె సరేననడంతో తన వాహనంపై ఎక్కించుకుని ఎల్‌.బి.నగర్‌వైపు తీసుకువెళుతూ గుడిలో పెళ్లి చేసుకుందామన్నాడు. నిఖిల్‌ ఉద్దేశం గమనించిన మహిళ కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు అనుమానంతో గుమిగూడడం ప్రారంభించారు.

దీంతో ప్రమాదాన్ని ఊహించిన నిఖిల్‌ యువతిని వదిలేసి పరారయ్యాడు. యువతి ఫిర్యాదు మేరకు నిఖిల్‌పై బంజారా హిల్స్‌ పోలీసులు కిడ్నాప్‌, బెదిరింపు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

More Telugu News